రూ.2,000 తగ్గుదల! భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: 2 నెలల కనిష్టానికి..
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం వరకు అస్థిరంగా ఉంటూ, కాస్త పెరుగుదల నమోదు చేసిన పసిడి ధర మూడు రోజులుగా క్షీణిస్తున్నాయి. సాయంత్రం సెషన్ సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి అక్టోబర్ ఫ్యూచర్స్ 1.2 శాతం మేర క్షీణించి 49,764కు పడిపోయింది. రూ.50,000 కిందకు దిగి వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 4 శాతం పడిపోయి రూ.58,851కి తగ్గింది. అంతకుముందు సెషన్లో పసిడి రూ.100కు పైగా తగ్గింది. సోమవారం రూ.1200 వరకు తగ్గింది. వెండి మంగళవారం రూ.6వేల వరకు క్షీణించింది.
రూ.50,000కు దిగివచ్చిన బంగారం ధరలు: అక్కడ తగ్గి, అంతలోనే పెరిగి...
గత నెల గరిష్టంతో రూ.6,500 తక్కువ
గత నెల ఆగస్ట్ 7వ తేదీన పసిడి పది గ్రాములు రూ.56,200 పైకి చేరుకుంది. ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చి, గరిష్ట ధరతో పోలిస్తే రూ.6,500 వరకు తక్కువగా ఉంది. గతవారం రూ.51,600 వరకు పలికింది. అంటే ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ.2,000 వరకు తగ్గింది. పండుగ సమయంలో పసిడి రూ.50,000 దిగువకు రావడం రిటైల్ దుకాణదారులకు, అలాగే, కొనుగోలుదారులకు కాస్త ఉత్సాహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పండుగ సమయంలో కొనుగోళ్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దీపావళి నాటికి మళ్లీ పెరుగుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది.
పెరుగుదల.. భారీ తగ్గుదలకు కారణాలు..
కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు గత ఆరు నెలల్లో భారీగా పెరిగాయి. అయితే గత నెల గరిష్ట ధర తర్వాత నుండి క్రమంగా పడిపోయాయి. గతవారం స్వల్పంగా పెరుగుదల కనిపించినప్పటికీ, ఈ వారం బంగారం ధరల పతనానికి డాలర్ సూచీ ర్యాలీ, మందగించిన వృద్ధి రేటుకు మద్దతిచ్చేందుకు అమెరికా ప్రభుత్వం తదుపరి ఉద్దీపన ప్యాకేజీపై అనిశ్చితి, సిక్స్ బాకెట్ కరెన్సీ ఇండెక్స్లో డాలర్ వ్యాల్యూ 8 వారాల గరిష్టానికి చేరుకోవడం వంటివి ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఐరోపా కరోనా సెంటిమెంట్తో డాలర్ బలపడటంతో ప్రపంచ మార్కెట్లలో పసిడి ధర ఆరు వారాల కనిష్టానికి పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1 శాతం పడిపోయి 1880.46 డాలర్లకు తగ్గింది. ఇప్పటికీ ఈ ఏడాది పసిడి 24 శాతం పెరిగినట్లే. అయితే గత నెల ఆల్ టైమ్ గరిష్టం 2,075తో పోలిస్తే దాదాపు 200 డాలర్లు తగ్గింది. సిల్వర్ ఏకంగా 4.8 శాతం తగ్గి ఔన్స్ 23.25 పలికింది. ఇది రెండు నెలల కనిష్టం. ఈ సెషన్లో ఓ సమయంలో 23.04 డాలర్లకు కూడా పడిపోయింది. తదుపరి మద్దతు ధర 1820 డాలర్ల నుండి 1875 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వివిధ నగరాల్లో..
ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.600కు పైగా తగ్గి రూ.50,750 పలికింది. గత సెషన్లో రూ.51,364 వద్ద ట్రేడ్ అయింది. వెండి కిలో రూ.1900 వరకు తగ్గి రూ.59,720 పలికింది. డాలర్ వ్యాల్యూ క్రమంగా బలపడుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుండి పెట్టుబడులు తరలుతున్నాయి. ఇన్వెస్టర్లు పసిడి లాభాలను వెనక్కి తీసుకుంటుండటంతో కొనుగోలు చేయవచ్చా అంటే.. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టవచ్చునని చెబుతున్నారు.