రూ.50,000కు దిగివచ్చిన బంగారం ధరలు: అక్కడ తగ్గి, అంతలోనే పెరిగి...
ముంబై: బంగారం, వెండి ధరలు నిన్న మరింత క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.18 శాతం క్షీణించి రూ.50,381 పలికింది. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధర ఓ సమయంలో అక్టోబర్ డెలివరీ రూ.1720 పడిపోయి రూ.50,000కు, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.1742 తగ్గి రూ.50,120కి కూడా తగ్గింది. వెండి ఫ్యూచర్స్ డిసెంబర్ కిలో 0.17 శాతం క్షీణించి రూ.61,213 పలికింది. నేచరల్ గ్యాస్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 0.30 శాతం క్షీణించి 134.40గా ఉంది. కేవలం క్రూడాయిల్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర మాత్రమే పెరిగింది. క్రూడ్ ధర 1.11 శాతం పెరిగి రూ.2,920 పలికింది.
బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండొచ్చు, ఎందుకు?
బంగారం ధరలు
విశాఖ, విజయవాడ, హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.600 మేర తగ్గింది. రూ.53,230 పలికింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.550 వరకు తగ్గి రూ.48,800 పలికింది. వెండి కిలో రూ.6,400 దిగి వచ్చి రూ.61,000 దిగువకు వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుండి డిమాండ్ పడిపోయింది.
స్పాట్ గోల్డ్ పెరిగి.. ఫ్యూచర్స్ క్షీణించి..
నిన్న ప్రారంభ సెషన్లో అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో పసిడి ధరలు క్షీణించాయి. 1900 డాలర్లకు పడిపోయాయి. అయితే అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, కరోనా కేసులు వంటి వివిధ కారణాలతో అతి స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ స్వల్పంగా 0.2 శాతం పెరిగి ఔన్స్ ధర 1,902.04 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. 0.1 శాతం మేర పడిపోయి ఔన్స్ 1,905.60 డాలర్లు పలికింది. వెండి ధర 0.6 శాతం మేర పడిపోయి ఔన్స్ 24.26 డాలర్ల వద్ద ఉంది. ప్లాటినమ్ ఔన్స్ 0.3 శాతం పెరిగి 869.64 డాలర్లు, పల్లాడియం 0.8 శాతం పడిపోయి 2,203.15 డాలర్లుగా ఉంది. ప్రపంచ అతిపెద్ద ఈటీఎఫ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిధులు 0.05 శాతం క్షీణించి 1,278.23గా ఉన్నాయి.
మరింతగా తగ్గవచ్చా?
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఓ సమయంలో ఔన్స్ 1,898.57 డాలర్లు పలికింది. ఇటీవల 1900 డాలర్ల వద్ద పైకి, కిందకు కదులుతోంది. స్వల్పకాలంలో పసిడి ధర 1889.70 డాలర్ల నుండి 1842.60 డాలర్ల మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 5న 1690 పలికిన పసిడి ఆగస్ట్ 7వ తేదీ నాటికి 2089కు చేరుకుంది.