ఉద్యోగాలున్నాయి..వర్కర్స్ని ఇవ్వండి: కంపెనీలు, వర్కింగ్ హవర్స్ 12గం.కు పెంచితే ఎక్స్ట్రా శాలరీ
'మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటాం.. తద్వారా మరింత ఉత్పత్తి చేస్తాం' అంటున్నాయి ఇండియా టాప్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు. హిందూస్తాన్ యూని లీవర్, నెస్ట్లే, పెప్సికో, పార్లే ప్రోడక్ట్స్, బ్రిటానియా, ఐటీసీ, మోండెలేజ్ వంటి FMCG కంపెనీలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సందేశం కూడా పంపించాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 75% మేర ఉద్యోగులు, రెడ్ జోన్స్లలో (కంటైన్మెంట్ జోన్లు మినహాయించి) 50% నుండి 60% ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని కోరాయి. ప్రస్తుతం 33% పరిమితి ఉంది.
శుభవార్త: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు
ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటాం
కంపెనీలు పనులను వేగవంతం చేస్తున్నాయని, ఆహార పదార్థాల లభ్యతను పెంపొందించేందుకు సామాజిక దూరం సహా వివిధ నిబంధనలు పాటిస్తూనే ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం ఇప్పుడు అవసరమని ఇండస్ట్రీ బాడీ CII ద్వారా ప్రభుత్వాన్ని కోరాయి సంస్థలు. ఈ మేరకు సీఐఐ లేఖ రాసింది. ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని ఎత్తివేయాలని కోరాయి.
పెరిగిన పనివేళలకు అదనపు చెల్లింపులు
పరిశ్రమల చట్టంలో కొన్ని సడలింపులు ఇచ్చి పనివేళలను 8 నుండి 12 గంటలకు పెంచేలా అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరాయి. పెరిగిన పని వేళలకు తగినట్లుగా చెల్లింపులు కూడా ఉంటాయని తెలిపింది. ఇది కార్మికుల సమ్మతితోనే జరగాలని తెలిపింది. పని గంటల నిబంధనల సడలింపు కూడా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడాలని కోరాయి. ఈ నిర్ణయాల ద్వారానే కస్టమర్ల డిమాండుకు తగినట్లుగా ఉత్పత్తులను అందివ్వగలమని చెబుతున్నారు.
అంతటా ఒకేలా ఉండాలి
ఓవర్ టైమ్పై రాష్ట్రాల స్పందన ఒకేరకంగా లేదని, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానాలు ఓవర్ టైమ్కు అనుమతిస్తున్నాయని, మరికొందరు ఈ స్టాండ్ తీసుకోలేదని చెబుతున్నాయి కంపెనీలు. శ్రామిక శక్తిపై పరిమితిని ఎత్తివేయాలని, అలాగే పని గంటల నిబంధనల సడలింపు కూడా ఒకే రకంగా ఉండాలని బ్రిటానియా ఇండస్ట్రీస్ ఎండీ వరుణ్ బెర్రీ అన్నారు. వివిధ రాష్ట్రాలకు భిన్నంగా ఉండకూడదన్నారు.
అందుకే సేల్స్ పెరిగాయి..
స్థానికంగా పోలీసుల అనుమతులు కూడా ఉండాలని కోరాయి కంపెనీలు. తొలి దశ లాక్ డౌన్ సమయంలో కస్టమర్లు కాస్త ముందుగా ఎక్కువ కొనుగోలు చేశాయని దీంతో మ్యాగీ నూడుల్స్, కిట్ కాట్ చాక్లెట్స్ అమ్మకాల్లో 10.7 శాతం పెరుగుదల నమోదయిందని నెస్ట్లే వెల్లడించింది. అధికారిక అనుమతులపై తమ వ్యాపార కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది.