నేడు మార్కెట్కు సెలవు: డెల్టా వేరియెంట్ ఎఫెక్ట్.. ఆర్థిక రికవరీపై ప్రభావం
బక్రీద్ సందర్భంగా నేడు(జూలై 21, బుధవారం) ఈక్విటీ, కరెన్సీ, డెరివేటివ్స్ మార్కెట్లు నేడు క్లోజ్గా ఉన్నాయి. కమోడిటీ మార్కెట్ నేడు మార్నింగ్ క్లోజ్గా ఉంటుంది. అయితే సాయంత్రం కమోడిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి. జూలై 22 గురువారం ట్రేడింగ్ తిరిగి తెరుచుకోనుంది.
మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు రోజు (సోమవారం) కూడా సూచీలు నష్టపోయాయి. ఈ వారం మొదటి రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు పతనమైంది. 30 షేర్ సెన్సెక్స్ నిన్న 355 పాయింట్లు లేదా 0.68 శాతం పతనమై 52,198.51 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 120.30 పాయింట్లు లేదా 0.76 శాతం క్షీణించి 15,632.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
మార్కెట్లు సోమవారం పతనాన్ని మంగళవారం కూడా కొనసాగించాయని, దాదాపు ఒక శాతం మేర నష్టపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా అమ్మకాల ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వైరస్ నేపథ్యంలో కోవిడ్ 19 కేసులు పెరగడం ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయని చెబుతున్నారు.