300 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్, 16200 పాయింట్లకు పైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగియడం, ఆసియా సూచీలు నేడు సానుకూలంగా ట్రేడ్ కావడం కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా ఇటీవల 100 డాలర్ల దిగువకు పడిపోయిన చమురు ధరలు నేడు ఆ మార్కును దాటాయి. మాంద్యం భయాలతో ఫెడ్ నిర్ణయంపై ఊహాగానాలు ఉన్నాయి. మన దేశంలో జూన్ మాసంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 27 శాతం పెరిగింది. 2021-22లో దేశీయంగా మొబైల్ తయారీ పెరిగి దిగుమతులు భారీగా తగ్గాయి. చాలా అంశాలు మార్కెట్కు సానుకూలంగా మారాయి.
దీంతో నేడు మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 54,574 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,627 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,350 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.35 సమయానికి సెన్సెక్స్ 212.44 పాయింట్లు ఎగిసి 54,385 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 16,189 పాయింట్ల వద్ద కదలాడింది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ఉన్నాయి.
మెటల్, రియాల్టీ రంగం మినహా అన్ని కూడా లాభాల్లో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ అయితే ఏకంగా 2 శాతం లాభపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లార్సన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, HDFC లైఫ్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి.