130 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్, కారణాలివే
అంతర్జాతీయ వ్యతిరేక పవనాల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఈ వారం సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సెన్సెక్స్ 52,908 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కోలుకొని, 53,000 పాయింట్లను క్రాస్ చేసింది. అయితే అంతలోనే తిరిగి నష్టాల్లోకి జారుకుంది. అమెరికా మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు అక్కడి మార్కెట్లకు సెలవు రోజు. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్స్ ఒత్తిడిలో ఉంది. ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లకు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి.
దీనికి తోడు దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు, కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని 12 శాతం నుండి నుండి 18 శాతానికి పెంచడం, మరిన్ని రేట్ల పెంపు ఉంటాయని ఫెడ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సంకేతాలు వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
సెన్సెక్స్ నేడు ఉదయం 52,851 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,067 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,674 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,710 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,797 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,661 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఉదయం గం.10.20 సమయానికి 138 పాయింట్లు ఎగిసి 52,770 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు ఎగిసి 15,689 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.