54,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ 16,100 పైన.. కారణాలివే
స్టాక్ మార్కెట్లు గురువారం (7 జూలై 2022) భారీ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 54,000 మార్కును క్రాస్ చేసింది. నిన్న 53,750 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, నేడు 400 పాయింట్ల వరకు ఎగిసి 54,146 పాయింట్ల వద్ద ప్రారంభించింది. ఉదయం గం.10.30 సమయం వరకు 54,250 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,980 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు ఏ సమయంలోను కనీసం నిన్నటి స్థాయికి పడిపోలేదు.
ఉదయం గం.10.35 సమయానికి సెన్సెక్స్ 377 పాయింట్లు ఎగిసి 54,128 పాయింట్ల వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 16,109 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 500 పాయింట్లు లాభపడింది. చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం మార్కెట్ లాభాలకు ఓ కారణం. క్రూడ్ ధరలు 100 డాలర్ల దిగువకు వచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు కూడా సానుకూలంగా ఉన్నాయి. చమురు ధరలు వంద డాలర్ల దిగువకు వచ్చాయి. చైనా ఈటీఎఫ్లు విదేశీ నిధులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మరోవైపు, రూపాయి పతనమవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇళ్ల అమ్మకాలు తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఇవి సూచీల సెంటిమెంటును బలపరిచాయి.