నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లోకి వచ్చిన మార్కెట్లు, 15800 వద్ద నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు నేడు (గురువారం, జూన్ 30) ఉదయం భారీ లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత అతి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ క్రితం సెషన్లో 53,000 మార్కు దాటింది. నేడు కూడా ఈ మార్కుకు పైనే ఉంది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత భారీ లాభాల్లోకి వచ్చి, అనంతరం ఫ్లాట్గా లేదా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 53,064 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు ఎగిసి 15,792 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ 52,897 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,377 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,897 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,774 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,890 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,765 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
రియాల్టీ, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తగా, పవర్ ఇండెక్స్ సూచీ ఒక శాతం లాభపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతీ సుజుకీ ఉంది. ఇక, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్రితం సెషన్లో దారుణంగా పతనమైంది. అయితే నేడు 11 పైసలు కోలుకొని, 78.92 వద్ద ప్రారంభమైంది.