భారీ నష్టాల నుండి కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. అయినా
స్టాక్ మార్కెట్లు నేడు (జూన్ 29) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న కూడా ఇలాగే భారీ నష్టాల్లో ప్రారంభమై, చివరి అరగంట వరకు నష్టాల్లోనే కొనసాగి, ఆ తర్వాత ఫ్లాట్గా ముగిశాయి. ఈ రోజు కూడా సూచీలు భారీగా నష్టపోయి, 53,000 దిగువకు వచ్చాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 53,000 పాయింట్లకు పైన ముగిసింది. ఈ రోజు మళ్లీ ఈ మార్కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ వ్యతిరేక పవనాల కారణంగా సెన్సెక్స్ ఓ సమయంలో 550 పాయింట్లకు పైగా కూడా క్షీణించింది. కానీ ఆ తర్వాత నష్టాన్ని తగ్గించుకుంది. బ్యాంకింగ్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.
సెన్సెక్స్ ఉదయం 52,623 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,973 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,612 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ క్రితం సెషన్లో 15,850 పాయింట్ల వద్ద ముగియగా, నేడు దాదాపు వంద పాయింట్లు క్షీణించింది. 15,701 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,787 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,687 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.38 సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు ష్టపోయి 52,950 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 15,772 పాయింట్ల వద్ద కదలాడింది.
ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం భయాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అమెరికా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గిందని నివేదికలు మంగళవారం అక్కడి మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. గ్యాస్, నిత్యావసర వస్తువులు, ఇళ్ల విక్రయాలు సహా వివిధ రంగాలు ధరల ప్రభావంతో అమెరికాలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇవి ప్రపంచ మార్కెట్ పైన, తదనుగుణంగా భారత మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి.