రియల్ ఎస్టేట్ కు భారీ దెబ్బ: 50% పడిపోనున్న పెట్టుబడులు!
రియల్ ఎస్టేట్ అంటేనే ఎప్పుడూ పరుగులు పెడుతూ అంతకంతకూ ధరలు పెరిగే ఒక అద్భుతమైన రంగమని పేరు. కానీ కరోనా వైరస్ తర్వాత దానికీ కష్టాలొస్తున్నాయి. మిగితా రంగాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో ... రియల్ ఎస్టేట్ రంగం కూడా అలాగే ప్రభావితమవుతోంది. దీంతో ఈ ఏడాది (2020) లో ఈ రంగంలోకి వచ్చే సంస్థాగత పెట్టుబడులు భారీగా తగ్గిపోనున్నాయి. కరోనా వైరస్ ను అరికట్టేందుకు, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా చూసేందుకు దేశంలో రెండు నెలల పాటు సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. కానీ, దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన దుష్పరిణామాలను చూపించింది. అన్ని రంగాలు తిరోగమన బాట పట్టాయి.
జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు
ఉద్యోగాలు ఊడిపోవటం, జీతాల్లో తగ్గుదల నమోదు కావటం వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు అత్యవసరాలు మినహా మిగితా కొనుగోళ్లు నిలిపివేశారు. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి గుదిబండగా నిలుస్తోంది. సాధారణంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు ఉండటానికి ఇల్లు, కొంత స్థలం ఉండాలనే కోరిక బలంగా ఉంటాయి. అందుకే మిగితా రంగాలు ఎలా ఉన్నా... రియల్ ఎస్టేట్ లో లావాదేవీలు కొనసాగుతుంటాయి. కానీ... ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పొచ్చు.
పతనమే...
రియల్ ఎస్టేట్ లో ప్రధానంగా మూడు విభాగాలుగా విభజిస్తారు. రెసిడెన్షియల్, రిటైల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ గా వీటిని పరిగణిస్తారు. రెసిడెన్షియల్ అంటే ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్టుమెంట్లు వస్తాయి. రెటైలో మాల్స్, గిడ్డంగులు వంటివి ఉంటాయి. ఇక కమర్షియల్ లో ఆఫీస్ స్థలాలు సహా ఇతరత్రా వి ఉంటాయి. అయితే, ప్రస్తుత కరోనా దెబ్బకు ఈ మూడు రంగాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. దీంతో ఈ రంగాల్లోకి వచ్చే ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 2020 లో సుమారు 45% నుంచి 50% వరకు తరుగుదల నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కుషుమాన్ అండ్ వెక్ఫీల్డ్ ను ఉంటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ పరిణామం స్వల్ప కాలం పాటు ఉంటుందని పేర్కొంది. అయితే అన్ని సంస్థలు తమ పెట్టుబడులను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటాయని తెలిపింది. 2019 లో ఇండియా లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు సుమారు రూ 45,000 కోట్లు కావటం గమనార్హం.
డిఫెన్స్ ముద్దు...
ఒకప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే యమా క్రేజ్ ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం జోరు మీద ఉండటంతో పాటు దేశంలో స్టార్టుప్ కల్చర్ పెరుగుతున్న కొద్దీ ఆఫీస్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇచ్చేశాయి. దీనిని పెర్మనెంట్ కూడా చేసే అవకాశం ఉంది. దీంతో ఆఫీస్ స్థలాలకు కూడా డిమాండ్ పడిపోతోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు డిఫెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు సరుకులు అధికంగా ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ కామర్స్ రంగం బూమ్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి, వేర్హౌస్ లు, లాజిస్టిక్స్ రంగంలో అవకాశాలు అధికంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఐటీ లో డేటా సెంటర్ల నిర్మాణంపై దృష్టిసారిస్తున్నారు.
అది కూడా ఒక కారణమే...
సాధారణంగా మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేది విదేశీ సంస్థలే. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, యూకే వంటి దేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ. జపాన్ లో అయితే జీరో శాతం. దీంతో వారు తమ పెట్టుబడులకు మెరుగైన రాబడి లభించే ఆకర్షణీయమైన మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తాయి. అందుకనే ఇక్కడ ఏటా బిలియన్ డాలర్ల మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ కరోనా తెచ్చిన కష్టాల వల్ల ప్రస్తుతం వారి సొంత దేశాల్లోనే చాలా కంపెనీలు, అస్సేట్ల విలువలు పడిపోయి కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. దీంతో, ఆయా సంస్థలు ప్రస్తుతం అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాయని, ఈ అంశం కూడా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు తగ్గేందుకు ఒక కారణంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.