Gold price today: రూ.51,000 దిగువకు పడిపోయిన బంగారం ధరలు
బంగారం ధరలు నేడు (జూన్ 21, 2022) అతి స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,000కు దిగువ ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు పెంపు, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ఉండటం వంటి అంశాలు పసిడి పైన ప్రభావం చూపాయి. 2022 ఈ మొదటి ఆరు నెలల కాలంలో బంగారం ధరలు 6.5 శాతం పెరిగాయి.
మధ్యాహ్నం గం.11.50 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ 33 పెరిగి రూ.50,768 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 3 పెరిగి రూ.50,998 వద్ద ఉంది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5500 తక్కువగా ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.75 తగ్గి రూ.60,669 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61 తగ్గి రూ.61,481 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1850 డాలర్లకు దిగువనే ఉంది. కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో 3.50 శాతం తగ్గి 1837.10 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 0.072 డాలర్లు తగ్గి 21.515 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది గోల్డ్ ఫ్యూచర్స్ 3.6 శాతం పెరగగా, సిల్వర్ ఫ్యూచర్స్ 17 శాతం తగ్గింది.