బంగారం ... బంగారమే! ఇకపై హాల్ మార్క్ తప్పనిసరి
బంగారం.. భారతీయుల మధ్య విడదీయలేని సంబంధం ఉంటుంది. తరాలు మారినా... టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా కూడా బంగారానికి డిమాండ్ తగ్గక పోగా ఇంకా పెరుగుతోంది. కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ బంగారానికి చాలా విలువ ఉంది. అయితే, మనం మార్కెట్లో కొనుగోలు చేసే బంగారం మేలిమి బంగారమేనా... అందులో ఎంత కల్తీ ఉంది... స్వచ్ఛత శాతం ఎంత అనే అనుమానాలు ఉండనే ఉంటాయి. ఎంత పెద్ద షాపులో కొనుగోలు చేసినా... ఒక్కడో ఒక మూలన అనుమానం తొలుస్తుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం బంగారానికి హాల్ మార్క్ విధానం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు దానిపై స్పష్టత వచ్చింది.
అయితే హాల్ మార్క్ విధానం ప్రస్తుతం పెద్ద పెద్ద నగల షాపుల్లో మాత్రం అందుబాటులో ఉంది. చిన్న షాపులు, నగల వ్యాపారులు హాల్ మార్క్ విధానానికి ఇంకా మారలేదు. మొత్తం బంగారం విక్రయాల్లో ఇప్పటికీ 60% నికి పైగా ఇలాంటి చిన్న షాపులు, మనకు బాగా తెలిసిన నగల వ్యాపారి నుంచే జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని షాపుల్లోనూ ఇకపై విక్రయించే ఆభరణాలు, గోల్డ్ పై హాల్ మార్క్ ఉండటం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది సరిగ్గా ఈ రోజు నుంచే అంటే... 2021 జనవరి 15 నుంచి కచ్చితంగా అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తోంది.
14, 18, 22 క్యారట్ల బంగారమే విక్రయించాలి...
బంగారం స్వచ్ఛత కు హామీ ఉండేలా కేంద్ర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకపై హాల్ మార్క్ కలిగిన 14, 18, 22 క్యారట్ల బంగారమే విక్రయించాలి. ఆభరణాలు కాకుండా కేవలం బంగారం అయితే 22 క్యారట్ల స్వచ్ఛత ఉండి తీరాల్సిందే. వజ్రాభరణాలు, బంగారు నగల్లో రాళ్లు పొదిగి ఉన్నట్లయితే మాత్రం 14 నుంచి 18 క్యారట్ల స్వచ్చతను ఆమోదిస్తారు. 916 నెంబర్ తో కూడిన 22కే ముద్రితమైన సింబల్ తప్పనిసరి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్).. నగల వ్యాపారులకు హాల్ మార్క్ ను ఇస్తుంది. ప్రతి నగను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సదరు నగకు హాల్ మార్క్ కేటాయించారు. దీంతో బంగారం కొనుగోలుదారులకు ఇకపై సంశయాలు ఉండనక్కరలేదని నిపుణులు చెబుతున్నారు.
ఏడాది గడువు...
ప్రభుత్వ నిబంధనలు పాటించేందుకు చిన్న షాపులకు మరో ఏడాది గడువు ఉంది. ఈ లోగా వారివద్దనున్న స్టాక్ ను విక్రయించుకోవాల్సి ఉంటుంది. లేదంటే బంగారాన్ని కరిగించి ప్రస్తుత నిబంధల ప్రకారం బీఐఎస్ హాల్ మార్క్ తీసుకుని నగలను విక్రయించుకోవచ్చు. కానీ ఏడాది తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ హాల్ మార్క్ లేని బంగారం, ఆభరణాలు విక్రయించేందుకు అనుమతించారు. ఒక వేల అలాంటి నగలు విక్రయిస్తూ పెట్టుబడితే కఠినమైన శిక్షలు పడతాయి. విక్రయించిన నగల విలువ పై 5 రెట్ల జరిమానా, ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తారు. ఇలాటి కఠినమైన శిక్షలు లేకుంటే వ్యాపారాలు ... వినియోగదారులను మోసం చేసే వీలు ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మీరూ పరిశీలించుకోవచ్చు...
బీఐఎస్ హాల్ మార్క్ ఉందని చెప్పి కొనుగోలు చేసిన నగల్లో నిజంగా అంత స్వచ్చత ఉందా ... లేదా అని మీరు కూడా తెలుసుకోవచ్చు. మీకు దగ్గరలోని అధీకృత బీఐఎస్ కేంద్రానికి వెల్లి ఒక్కో నగకు సుమారు రూ150 నుంచి రూ 250 చెల్లించి తనిఖీ చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఇలంటి కేంద్రాలు సుమారు 900 వరకు ఉన్నాయి. వీటి సంఖ్యను రెట్టింపు కంటే ఎక్కువ చేయాలనీ, ప్రతి జిల్లాలోనూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ బాగస్వామ్యంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నగల వ్యాపారులు మాత్రమే బీఐఎస్ వద్ద రిజిస్టర్ చేసుకున్నారట. మరో 5 లక్షల మంది నగల వ్యాపారులు ఈ ఏడాదిలో తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.