విదేశీ సంస్థల చేతుల్లోకి BPCL? కారణాలు ఇవే
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. BPCL దేశంలోనే రెండో అతిపెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ. ఇందులో ప్రభుత్వానికి ఉన్న 53.3 శాతం వాటాను విదేశీ సంస్థలకు విక్రయించాలని భావిస్తోందని తెలుస్తోంది. దీంతో బహుళజాతి సంస్థలను భారత ఇంధన రిటైల్ రంగంలోకి ఆహ్వానించాలని కేంద్రం యోచిస్తోందట. ఈ రంగంలో ప్రభుత్వరంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, ఈ రంగంలో పోటీని పెంచేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని భావిస్తోంది.
BPCL ద్వారా 40 శాతం నిధులు
ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో ఈసారి ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది నెరవేరేలా లేదని భావిస్తున్నారు. BPCLలోని మెజార్టీ వాటా విక్రయంతో ప్రభుత్వానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో 40%కు పైగా నిధులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. దేశంలో రెండో అతిపెద్ద చమురు శుద్ధి, ఇంధన విక్రయ సంస్థ అయిన BPCL వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయట. ప్రైవేటీకరణ విషయంలోను కేంద్రం తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.
BPCL విక్రయానికి ప్రయత్నాలు
కేంద్రం గతంలో కూడా BPCL విక్రయానికి ప్రయత్నాలు చేసింది. కానీ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనల నేపథ్యంలో 2003లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దానికి అడ్డు పడింది. BPCLని IOCకి విక్రయించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే BPCLను కొనుగోలు చేసేందుకు IOC మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం వంటి తలనొప్పుల కారణంగా ఈ ఆలోచన ముందుకు కదల్లేదు.
కంపెనీ ప్రస్థానం..
BPCL ప్రైవేటీకరణకు పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంటుంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో BPCLగా మార్చింది. రాయల్ డచ్ షెల్, బర్మా ఆయిల్ కంపెనీ, ఆసియాటిక్ పెట్రోలియం (ఇండియా) కలిసి 1920లో బర్మా షెల్ కంపెనీని ఏర్పాటు చేశాయి. కానీ 1970లో దీనిని జాతికి అంకితం చేశారు. భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్గా మార్చారు. ఇప్పుడు మళ్లీ విదేశీ సంస్థలకు వాటాలు విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ వైపు బహుళజాతి ఇంధన సంస్థల చూపు
బహుళ జాతి సంస్థలెన్నో భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తితో ఉన్నాయి. సౌదీ ఆరామ్ కో, రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, BPలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపు అవుతుందని అంచనా. అంతేకాకుండా ఈ రెండేళ్లలో చమురుకు భారత్లోనే ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఒపెక్ దేశాల అంచనా. దీంతో భారత్లో అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో BPCLలో ప్రభుత్వ వాటా విక్రయం ప్లాన్ గమనార్హం. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49 శాతం వాటాను BP కొనుగోలు చేసింది.
రూ.88,700 కోట్లకు కంపెనీ మార్కెట్ వ్యాల్యూ
BPCL వాటా విక్రయ ఊహాగానాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజింగ్ సమయానికి షేరు ధర 6.42 శాతం ఎగిసి రూ.408.90 వద్దకు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.88,700 కోట్లకు చేరుకుంది.