పెట్రోల్, డీజిల్ వినియోగంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. కలప, బొగ్గు ఉపయోగించడం నుంచి దేశం LPG సిలిండర్ కు మారగా.. ఇప్పుడు మరో కొత్త మార్పు చూడబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ అని మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశీయంగా తగిన స్థాయిలో డిమాండ్, ఉత్పత్తి ఉన్నప్పుడు పూర్తిగా హైడ్రోజన్ ఆధారిత ఇంధనం వైపు ప్రజలు మళ్లుతారన్నారు. కలప నుంచి LPGకి మారిన విధంగానే వినియోగదారులు పెట్రోల్, డీజిల్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వాడకం దిశగా అడుగులేస్తారన్నారు.

2021లో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ హైడ్రోజన్ ఉపయోగించడంపై మాట్లాడినట్లు గుర్తుచేశారు. ఇందుకు సంబంధించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గతంలో గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా ఉండేవని, మహిళలు వంట చేసేందుకు బొగ్గును వినియోగించేవారన్నారు. దీనివల్ల ఆహారం విషపూరితంగా మారుతుందని గుర్తించి.. ఉజ్వల పథకం ద్వారా నిరుపేదలకు 9 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు చెప్పారు.
ఇక కార్ల విషయానికొస్తే.. ఓవైపు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుండగా.. పెట్రోల్ ను జీవ ఇంధనాలతో కలిపి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని పూరి తెలిపారు. 20 శాతం బ్లెండింగ్ వరకు వాహనాల విడిభాగాలకు తుప్పు పట్టే అవకాశం లేదని గుర్తించిన తర్వాతే ఆమేరకు ఇథనాల్ కలుపుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications