Windfall Tax: ఒకపక్క పెట్రోలియం ఉత్పత్తి దేశాలు తమ రోజువారీ క్రూడ్ ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 90 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇప్పటికే పెట్రో ధరల భారంతో అల్లాడుతున్న ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే.
ఇదే క్రమంలో భారత ప్రభుత్వం దేశీయ చమురు కంపెనీలకు షాక్ ఇచ్చింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ పన్నును టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తాజా పెంపు సెప్టెంబర్ 16 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి ముందు సెప్టెంబర్ 1న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్పై విండ్ఫాల్ ట్యాక్స్ను టన్నుకు రూ.7,100 నుంచి రూ.6,700కి తగ్గించిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ(SAED)ని లీటరుకు రూ.4 నుంచి రూ.3.5కి తగ్గించింది. అలాగే డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను సెప్టెంబరు 16 నుంచి లీటరుకు రూ.6 నుంచి రూ.5.5కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లు సమీక్షించబడతాయి. శుక్రవారం చమురు ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 90 డాలర్లకు పైగానే కొనసాగుతోంది.
గత ఏడాది జూలైలో భారత్ ముడి చమురు ఉత్పత్తిదారులపై విండ్ఫాల్ పన్నును విధించింది. దేశంలోని ప్రైవేట్ రిఫైనర్లు స్వదేశంలో విక్రయించే బదులు విదేశీ మార్కెట్లలో బలమైన రిఫైనింగ్ మార్జిన్ల నుంచి లాభాలు పొందేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై లెవీని పొడిగించింది. గ్లోబల్ బెంచ్మార్క్ రేట్లు బ్యారెల్కు 75 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే దేశీయ ముడి చమురుపై విండ్ఫాల్ పన్ను విధించబడుతుంది. చైనా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల కూడా క్రూడ్ దూసుకుడు కారణమౌతోంది.


Click it and Unblock the Notifications