గుడ్న్యూస్ ఎప్పుడో?: జీరో ట్యాక్స్ రేటులో పెట్రోల్, రాష్ట్రాలు ఓకే చెబితే జీఎస్టీలోకి
పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరాభారం తగ్గుతుందని వాహనదారులు ఆశపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో తాజాగా పెట్రోలియం ఉత్పత్తులు-జీఎస్టీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కోల్కతాలో స్పందించారు.
రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
పెట్రోలియం జీఎస్టీతో కలిపే ఉంది కానీ..
పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీతో కలిపే ఉన్నాయని, అయితే వాటిపై ఎలాంటి పన్ను లేదని నిర్మల తెలిపారు. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం జీఎస్టీ కౌన్సెల్, రాష్ట్రాలపై ఆధారపడి ఉందని చెప్పారు. వాళ్లు ఎప్పుడు అంగీకారం తెలిపితే అప్పుడు అమల్లోకి వస్తుందన్నారు.
రాష్ట్రాలు ఓకే అంటే...
జీఎస్టీ పరిధిలోకి వచ్చినప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకు వచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తే అందుకు చట్ట సవరణ అవసరం లేదని ఆమె వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రాలు, జీఎస్టీ కౌన్సిల్ చేతుల్లో ఉందన్నారు. పెట్రో ఉత్పత్తులు జీఎస్టీతో కలిసే ఉన్నాయని, రాష్ట్రాలు నిర్ణయం చెబితే పెట్రోల్, డీజిల్లు దీని పరిధిలోకి వచ్చినట్లే అన్నారు.
ప్రస్తుతం జీరో ట్యాక్స్ రేట్లో పెట్రోలియం
దివంగత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దూరదృష్టితో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీతో కలిపి ఉంచినట్లు నిర్మల చెప్పారు. ఈ అంశంపై ఎన్నో డిస్కషన్స్ జరిగాయన్నారు. జైట్లీ ఓ నిబంధన రూపొందించారని, ప్రస్తుతం జీఎస్టీలో జీరో రేటెడ్ పెట్రోలియం ఉత్పత్తి సదుపాయాన్ని రూపొందించారని చెప్పారు.
అప్పుడు పన్ను ఎంతో నిర్ణయించబడుతుంది
వస్తు ఉత్పత్తిగా పెట్రోలియంపై ఎలాంటి పన్ను లేకుండా ప్రొవిజన్లో చేర్చారని నిర్మల చెప్పారు. కాబట్టి రాష్ట్రాలు ఓకే చెప్పి, జీఎస్టీ కౌన్సెల్ డిస్కషన్స్ చేసి నిర్ణయించినప్పుడు పన్ను ఎంత ఉంటుందో తెలుస్తుందని చెప్పారు.