గుడ్ న్యూస్: ఆటోమేషన్తో జాబ్ లాస్ తక్కువే, అనుకున్నంత ప్రమాదమేమీ లేదు
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు శుభవార్త. ఆటోమేషన్ తో తమ కొలువులు పోతాయని భయపడుతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే. ఎందుకంటే, ఆటోమేషన్ తో నిజానికి మనం భయపడుతున్న మేరకు ఉద్యోగాలు ఏమీ పోవని ఐటీ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పుడు పనిచేస్తున్న రోల్స్ లో కాకుండా మరింత ఉన్నతమైన, సృజనాత్మకమైన, తెలివైన విభాగాల్లో ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. దీంతో, జాబ్ లాస్ కంటే కూడా జాబ్ రీప్లేస్మెంట్ జరుగుతుందన్న విషయాన్నీ ఉద్యోగులు గుర్తించాలని, ఆ మేరకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపాలని సూచిస్తున్నారు. ఆటోమేషన్ అన్న పదం వింటేనే వణికి పోతున్నలక్షల మంది ఐటీ , బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు దీంతో కొంత ఊరట లభించినట్లే. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ తనదైన ముద్రను వేసింది. తొలినాళ్లలో కేవలం చిన్న చిన్న అవుట్ సోర్సింగ్ జాబ్స్ తో మొదలైన ఇండియన్ ఐటీ రంగం... ఇప్పుడు కొత్త టెక్నాలజీ రూపకల్పన లో, ఇన్నోవేటివ్ సోల్యూషన్స్ అందించటం లో దూసుకు పోతోంది. అందుబాటు ధరల్లో అత్యుత్తమ, నాణ్యమైన ఐటీ సేవలకు మన దేశం కేర్ ఆఫ్ అడ్రసుగా నిలుస్తోంది. కానీ... కొంత కాలంగా ఈ రంగాన్ని ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీ లు ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.
45 లక్షల మంది నిపుణులు...
ఇండియా లో ఐటీ సేవల రంగం చాలా అభివృద్ధి చెందింది. మన దేశ ఐటీ పరిశ్రమ పరిమాణం 180 బిలియన్ డాలర్ల (సుమారు రూ 12.60 లక్షల కోట్లు) స్థాయికి చేరుకొంది. ఈ రంగం ఏకంగా 45 లక్షల మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా సుమారు 2 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుకే, ఈ రంగంలో వచ్చే కొత్త పరిణామాలు దేశంలో లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. 2008 ఆర్ధిక సంక్షోభం సమయంలో అది స్పష్టమైంది కూడా. అందుకే, ఆటోమేషన్ వంటి కొత్త తరహా ప్రాసెస్ వల్ల సంభవించే మార్పులపై కొంత కాలంగా విపరీతమైన చర్చ జరుగుతోంది.
ప్రభావం 10 శాతం లోపే...
ఐటీ , బీపీఓ రంగాల్లో ప్రాసెస్ ఆటోమేషన్ చేయడం వల్ల భయపడినంత ఉద్యోగాలు ఏమీ పోవని... ఆటోమేషన్ ప్రభావం 10% లోపే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ ప్రభావం 5% మేరకు ఇండవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే, ఈ రంగంపై ఒక్కసారిగా ఆకాశం విరిగి పడేంత ప్రమాద సూచికలు ఏమి కనిపించటం లేదన్నది నిపుణుల వాదన. నాలుగో పారిశ్రామిక విప్లవం లో భాగంగా ఈ పరిణామాన్ని చూడాలని వారు చెబుతున్నారు. రోబోలు సాధారణ పనులను మాత్రమే చేయగలవాని, మానవ మేధస్సుతో చేయగలిగే పనులను వాటికి వెంటనే అప్పజెప్పే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఎంట్రీ లెవెల్ జాబ్స్ పై అధిక ప్రభావం...
అతి తక్కువ నైపుణ్యంతో కూడిన ఎంట్రీ లెవెల్ జాబ్స్ పై మాత్రం ఆటోమేషన్ ప్రభావం కొంత అధికంగా ఉంటుందని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, డేటా ఎంట్రీ వంటి అతి సాధారణ పనులకు, అధిక మంది మానవ వనరులను ఉపయోగించాల్సి ఉండదని, ఆ పనులను రోబోలకు, ఇతర సాఫ్ట్ వేర్ ఆటోమేషన్ ప్రాసెస్ ల ద్వారా పూర్తి చేయవచ్చని చెబుతున్నారు. అందుకే, ఐటీ, బీపీఓ రంగాల్లో రాణించాలనుకునే యువత ఆదిలోనే నైపుణ్యం కలిగిన కోర్సులు చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ లను నేర్చుకొంటే... వారి ఉపాధికి వచ్చే ఢోకా ఏమీ ఉండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
మారనున్న పని విధానం...
అయితే, ఆటోమేషన్ ప్రక్రియ వల్ల ఈ రంగంలో పని విధానం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న విభాగాల నుంచి నిపుణులను సరికొత్త టెక్నాలజీ విభాలవైపు తరలించటం తప్పనిసరి అని వారు విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు ఉద్యోగులు కూడా మానసికంగా, నైపుణ్య పరంగా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక్కడే, ఐటీ , బీపీఓ రంగాలు సరికొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాయని వారు అనుమానిస్తున్నారు. మానవ వనరుల విభాగాలు ఈ దిశగా కొత్త వ్యూహాలకు పదును పెట్టాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా... ఉద్యోగం కాపాడుకోవాలంటే మాత్రం కొత్త టెక్నాలజీ నేర్చుకొంటే మంచిది. మీరు ఏమంటారు?