Job For All: దేశంలో అందరికీ ఉద్యోగంపై రిపోర్ట్.. ఎన్ని లక్షల కోట్లు కావాలంటే.. కొత్త రకం టాక్స్..
Job For All: ఉద్యోగం అనేది సగటు మనిషి జీవించటానికి ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత దేశంలో ఏకంగా 21.8 కోట్ల మంది ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధి పొందుతున్న వారిని మినహాయించటం జరిగింది. అంటే మెుత్తం దేశ జనాభాలో 1/6 వంతు మంది ఖాళీగా ఉన్నారు. ఎంతో విలువైన మానవ వనరులు పూర్తిస్థాయిలో వినియోగం కావటం లేదు. దీనిని ఉపయోగించుకోగలితే భారత్ అభివృద్ది విషయంలో చైనాను చాలా సులువుగా దాటేయగదు.
తాజా అధ్యయనం..
People's Commission on Employment and Unemployment నిర్వహించిన తాజా అధ్యయనం చాలా ముఖ్యమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. భారత దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం కల్పించేందుకు 'Right to Work' చట్టాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. అయితే ఇందుకోసం భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశ జీడీపీలో 5 శాతం అంటే.. దాదాపు రూ.13.52 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని అధ్యయనం వెల్లడించింది.ఈ కమీషన్ ను దేశ్ బచావో అభియాన్ ఏర్పాటు చేసింది.
నివేదిక వివరాలు..
'రైట్ టు వర్క్: ఫీజిబుల్ అండ్ ఇన్డిపెన్సబుల్ ఫర్ ఇండియా టు బి రియల్ సివిలైజ్ అండ్ డెమోక్రటిక్ నేషన్' అనే అధ్యయనాన్ని People's Commission మంగళవారం విడుదల చేసింది. చట్టపరమైన, సామాజిక-రాజకీయ, ఆర్థిక అంశాల్లో తీవ్రమైన మార్పులు అవసరం కాబట్టి పీస్మీల్ విధానం అంటే దశల వారీగా మార్పులు తీసుకురావటం ద్వారా పూర్తి ఉపాధిని(Full employment) సాధించలేమని నివేదిక తేల్చి చెప్పింది.
పౌరుల గౌరవం కోసం..
పౌరులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం 'Right to Work' చట్టాన్ని రూపొందించాలని కమీషన్ సూచించింది. అందరికీ ఉపాధి సాధించటానికి భారత్ జీడీపీలో 5 శాతం పెట్టుబడి పెట్టాలని.. రానున్న ఐదు సంవత్సరాల్లో ఆ వ్యాయాన్ని జీడీపీలో మరో ఒక్క శాతం పెంచి 6 శాతానికి చేర్చాలని నొక్కి చెప్పింది.
గిరాకీ పెరుగుతుంది..
దేశంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించటం, వాటిని భారీగా పెంచటం వల్ల ఉత్పత్తి పెరగటంతో పాటు ఎకానమీలో డిమాండ్ కూడా ఊపందుకుంటుందని కమిషన్ సూచించింది. ఇది ఆర్థిక వ్యవస్థ చక్రంలో మంచి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం కేవలం 30.4 కోట్ల మందికి మాత్రమే సరైన పని ఉందని తెలిపింది.
నయా టాక్స్ విధానం..
ప్రస్తుతం ఉన్న విధానానికి ప్రత్యామ్నాయ పద్ధతులను సిద్ధం చేస్తే అవి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉదాహరణగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న కొత్త సాంకేతికత వారి అవసరాలకు తగినదే కానీ.. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి మంచిది కాదని నివేదిక తెలిపింది. దీని వల్ల కొన్ని కంపెనీలకు లాభదాయకమే అయినప్పటికీ.. ఉపాధి అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొంది. అందువల్ల సాంకేతికతను దిగుమతి చేసుకుని ఉపాధిని తగ్గించే కంపెనీల నుంచి టాక్స్ వసూలు చేసి, దానిని కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు వినియోగించాలని తెలిపింది.