నాలుగో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్స్ , ఈ రోజు ప్రభుత్వ బ్యాంకుల వంతు
స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల బాట పట్టింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుంగదీసింది.
స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల బాట పట్టింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుంగదీసింది. ఉదయం నుంచి స్థబ్ధుగా సాగిన మార్కెట్లకు మిడ్ సెషన్ తర్వాత పతనబాట పట్టాయి. ఓపెనింగ్ ట్రేడ్ నుంచి మధ్యాహ్నం వరకూ 60-70 పాయింట్ల టైట్ రేంజ్లో సాగిన సూచీలకు ఆఖరి గంట ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంట్రాడేలో 10891 పాయింట్ల గరిష్ట స్థాయికిచేరిన మార్కెట్లు చివరకు 10772 పాయింట్ల కనిష్టానికి దిగొచ్చింది. సుమారు 120 పాయింట్లు వొలాటిలిటీ రుచి చూసిన నిఫ్టీ చివరకు 38 పాయింట్ల నష్టంతో 10794 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 120 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్లు కోల్పోయింది.
అదానీ పోర్ట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్,> యూపీఎల్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, హెచ్ పి సి ఎల్, ఐఓసి, గెయిల్, ఓఎన్జీసీ స్టాక్స్ టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో చేరాయి.
ఐటీ, రియాల్టీ మినహా...
ఈ రోజు ట్రేడ్లో ఐటీ, రియాల్టీ రంగ స్టాక్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ఆటో, మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగ సూచీలు అధికంగా పతనమయ్యాయి. పీఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికెట్ బ్యాంక్ వంటి స్టాక్స్ 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. ఆటో ప్యాక్లో ఐషర్ మోటార్స్, బాష్, అశోక్ లేల్యాండ్ స్టాక్స్ 4 శాతం వరకూ నష్టాలను నమోదు చేశాయి.
ఇన్ఫ్రా స్టాక్స్లో చలనం
గత రెండు నెలల నుంచి భారీ నష్టాల్లో ఊగిసలాడిన మౌలిక సదుపాయాల కల్పన రంగంలోని స్టాక్స్లో ఈ రోజు కొద్దిగా చలనం వచ్చింది. బాగా సెల్లింగ్ ప్రెషర్కు లోనైన ఈ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ కనిపించింది. దలీప్ బిల్డ్కాన్ 9 శాతం, సింప్లెక్స్ ఇన్ఫ్రా, పటేల్ ఇంజనీరింగ్ 8 శాతం, కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ స్టాక్ 3 శాతం వకరూ లాభపడ్డాయి.
బాగా పడిన స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు
ఈ మధ్య వచ్చిన మిడ్ క్యాప్ మెల్డ్డౌన్లో కరిగిన కొన్ని స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు లభించింది. దివాల్ హౌసింగ్ 4.5 శాతం, విఏ టెక్ వాబాగ్ 4 శాతం, ఐబీ హౌసింగ్ 3 శాతం, కాఫీ డే 7 శాతం, అడ్వాన్స్ ఎంజైమ్ 3 శాతం, గతి 11 శాతం, ఐజీపెట్రో 10 శాతం, శంకర బిల్డింగ్ 5 శఆతం, 8 కె మైల్స్ 5 శాతం లాభపడ్డాయి.
బుల్లెట్ స్పీడ్ తగ్గుతోంది
ఐషర్ మోటార్స్ నిరుత్సాహక త్రైమాసిక ఫలితాల నేపధ్యంలో స్టాక్ క్రమంగా వీక్ అవుతోంది. ఈ రోజు కూడా స్టాక్ 4.2 శాతం నష్టపోయి రూ.20151 దగ్గర క్లోజైంది.
ఈ రోజే ఫలితాలు వెల్లడించిన మరో ఎంఎన్సీ బాష్ కూడా దిగాలుపడింది. క్వార్టర్లీ రిజల్ట్స్ అంతంతమాత్రంగా ఉండడంతో స్టాక్ 4 శాతం కోల్పోయింది. చివరకు రూ.17897 దగ్గర క్లోజైంది.
ఆయిల్ సంస్థల నీరసం
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కొద్దిగా పెరగడంతో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ నష్టపోయాయి. ఇందులో భాగంగా హెచ్ పి సి ఎల్ 3.5 శాతం, ఇండియన్ ఆయిల్ కార్ప్ 3.25 శాతం, బిపిసిఎల్ 3.10 శాతం కోల్పోయాయి.
సిజి పవర్ 30 శాతం డౌన్
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.150 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన సిజి పవర్ స్టాక్ను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున వదిలించకున్నారు. దీంతో ఈ స్టాక్ ఏకంగా 30 శాతం పతనమైంది. సంస్థ ప్రకటించిన నష్టంలో రూ.116.6 కోట్ల ఒన్ టైం లాస్ కూడా ఉంది.
ఈ రోజే ఫలితాలను వెల్లడించిన మరో సంస్థ జైన్ ఇరిగేషన్ స్టాక్ కూడా 7 శాతం వరకూ నష్టపోయింది. నికర లాభంలో 22 శాతం వృద్ధి ఉన్నప్పటికీ ఆదాయంలో వృద్ధి 7 శాతానికి పరిమితం కావడం, రుణభారం పెద్దగా తగ్గకపోవడం ఈ స్టాక్ను నష్టాల్లోకి నెట్టింది. చివరకు స్టాక్ 6 శాతం నష్టాలతో రూ.51.20 దగ్గర క్లోజైంది.