కేంద్రం నిర్ణయం, భారీగా ఎగిసిన అదానీ షేర్లు, దూసుకెళ్లిన 'జీ'
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(ఆగస్ట్ 19) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం గం.9.30 సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 62 పాయింట్లకు పైగా లాభపడింది. సాయంత్రం సెన్సెక్స్ 86.47 పాయింట్లు లేదా 0.22% లాభపడి 38,614.79 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు లేదా 0.20% లాభపడి 11,408.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1651 షేర్లు లాభాల్లో, 926షేర్లు నష్టాల్లో ముగియగా, 104షేర్లలో ఎలాంటి మార్పులేదు.
అమెరికా సెక్యూరిటీస్ తగ్గించి, భారీగా బంగారం కొనుగోలు చేయనున్న ఆర్బీఐ, ఎందుకంటే?
నష్టాల్లో ఫార్మా, ఐటీ
- ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో ముగిశాయి.
- బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.6 శాతం నుండి 1 శాతం లాభాల్లో ముగిశాయి.
- టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, గెయిల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా సుజీకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, నెస్ట్లే, కోల్ ఇండియా, విప్రో ఉన్నాయి.
- సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరలో స్వల్ప లాభాల్లో ముగిసినప్పటికీ 5 నెలల గరిష్టానికి చేరుకున్నాయి.
- ఈ రోజు గరిష్టం నుండి సెన్సెక్స్ 150 పాయింట్ల వరకు పడిపోయింది.
- మిడ్ క్యాప్ సూచీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా కెమికల్స్, ఫెడరల్ బ్యాంకు ఎక్కువగా లాభపడ్డాయి.
- కొటక్ మహీంద్రా బ్యాంకు నష్టాల్లో, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాభాల్లో ముగిశాయి.
- జీ ఎంటర్టైన్మెంట్ రెండున్నర నెలల గరిష్టానికి చేరుకుంది.
జీ, అదానీ అదుర్స్
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కంటెంట్ ప్రొడక్షన్కు సమస్యలు ఎదురైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ప్రస్తుతం తిరిగి ప్రొడక్షన్ తదితర పనులు ప్రారంభం అయ్యాయని, మెరుగైన పనితీరు చూపగలమని తెలిపింది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ షేర్ ధర 14 శాతానికి పైగా ఎగిసి రూ.198.40 వద్ద ముగిసింది.
ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతిపాదనను నేడు కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీని షేర్ దాదాపు 14 శాతం ఎగిసి 243 వద్ద క్లోజ్ అయింది. కేంద్ర కేబినెట్ అదానీ చేతికి మరో మూడు విమానాశ్రయాలు అప్పగించనుంది.
బలహీనపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి 74.82 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో ఈ ప్రభావం పడింది. ఉదయం 74.69వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్లో 74.76 వద్ద క్లోజ్ అయింది. నిన్నటితో పోలిస్తే ఆరు పైసలు నష్టపోయింది. 74.68 నుండి 74.92 మధ్య ఈ రోజు ట్రేడ్ అయింది.