Curd: పెరుగు తినటం కష్టమే..! జీఎస్టీ పెంచింది 5%.. కానీ రేటు 50 శాతం పెరిగింది..
Curd: తాజాగా దేశంలో జరిగిన జీఎస్టీ రేట్ల మార్పులో కేంద్ర ప్రభుత్వం పెరుగు, పన్నీర్, లస్సీ వంటి పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ రేటును అమలులోకి తెచ్చింది. ఈ పెరిగిన రేట్లు జూలై 18 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దీని అమలులో భాగంగా డెయిరీలు రేట్లను కూడా పెంచాయి. పెరుగు ప్యాకెట్లపై జీఎస్టీ ఐదు శాతం పెరిగినప్పటికీ వాటి రేట్లు మాత్రం 50 శాతం మేర పెరిగిపోయాయి. పెరుగు, పన్నీర్, లస్సీ, హనీ, డ్రై సోయాబీన్, వీట్ వంటి ప్యాక్ చేసిన ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయం భారంగా మారిందని అనేక మంది అంటున్నారు.
50 శాతం పెరిగిన ధరలు..
ఈ క్రమంలో దేశీయ దిగ్గజ సంస్థ బ్రిటానియాను గమనించినట్లయితే 80 గ్రాముల పెరుగు ప్యాకెట్ ను గతంలో రూ.10కి విక్రయించేది. కానీ ప్రస్తుతం దాని ధరను కంపెనీ ఏకంగా రూ.15కు పెంచేసింది. ఇదే సమయంలో బీహార్ కు చెందిన సుధా కంపెనీ పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి పాల ఉత్పత్తుల ధరలను పెంపును ప్రకటించింది. ఇదే సమయంలో ఇతర పాల ఉత్పత్తుల ధరలు సైతం దాదాపుగా 20 శాతం వరకు పెరిగాయి.
ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న వస్తువులు..
అయితే లస్సీ, పెరుగు, పన్నీర్, మజ్జిగ వంటి సామాన్యులు వినియోగించే ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు భారంగా మారిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సమావేశంలో అన్ని రాష్ట్రాలు రేటు పెంపుకు అంగీకరించాయని, ఎవ్వరూ వ్యతిరేకించలేదని మంగళవారం రాజ్యసభలో ద్రవ్యోల్బణంపై అడిగిన చర్చకు సమాధానం ఇచ్చారు.
సామాన్యలపై ప్రభావం ఉండదా..?
ప్యాకేజింగ్ చేయని ఆహారంపై జీఎస్టీ వర్తించదు. పాలు, పెరుగు, పనీర్ వంటి ప్యాక్ చేయని ఆహార పదార్థాలపై ఎలాంటి పన్ను వసూలు చేయనందున పేదలు 'జీఎస్టీ' భారాన్ని మోయాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా పాకిస్థాన్ లాగా కుప్పకూలదని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారత్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు.