18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరలు, సామాన్యుడికి మాత్రం తగ్గని పెట్రో భారం! ఎందుకంటే?
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 18 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో చమురు డిమాండ్ తగ్గింది. బ్యారెల్కు 20 డాలర్లతో పద్దెనిమిదేళ్ల కనిష్టానికి తగ్గింది. WTI క్రూడాయిల్ ఓ సమయంలో 20 డాలర్ల కనిష్టానికి చేరుకుంది. బ్రెంట్ క్రూడాయిల్ 23 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి.
కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు
అలా ఐతే 20 డాలర్ల దిగువకు..
2002 నవంబర్ తర్వాత తొలిసారి WTI క్రూడ్ ధర 20 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడం, డిమాండ్ను మించి సరఫరా ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి సౌదీ అరేబియా, రష్యా రోజువారీ ఉత్పత్తిని 36 లక్షల బ్యారెల్స్ పెంచనున్నాయి. సౌదీ అయితే మే నెల నుంచి రోజువారీ ఎగుమతులను ప్రస్తుత కోటి బ్యారెల్స్ నుంచి 1.6 కోట్ల బ్యారెల్స్కు పెంచాలని నిర్ణయించింది. ఇదే జరిగితే బ్యారెల్ ముడి చమురు త్వరలో 20 డాలర్ల దిగువకు వచ్చే అవకాశముంది.
భారత్లో తగ్గకపోవడానికి కారణమిదే
గత పదిహేను రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర 20% వరకు తగ్గింది. మన దేశంలో వినియోగదారులకు ఆ ప్రయోజనం అందడం లేదు. ఆయిల్ కంపెనీలు గత 14 రోజులుగా అవే ధరలు కొనసాగిస్తున్నాయి. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని రూ.3 పెంచడమే ఇందుకు కారణం. ఆ రూ.3 భారాన్ని భర్తీ చేసుకునేందుకు ఆయిల్ కంపెనీలు గత 14 రోజులుగా అవే ధరలు కొనసాగిస్తున్నాయి.
మార్చి 16న చివరిసారి సవరణ
చమురు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పెరిగిన ఎక్సైజ్ సుంకానికి ఆయిల్ కంపెనీలు సర్దుబాటు చేస్తున్నాయని, అందుకే అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు యథాతథంగా ఉన్నాయని చెబుతున్నారు. మార్చి 16న కంపెనీలు చివరిసారి ధరలు సవరించాయి.
భారత్లో తగ్గకపోవచ్చు
కరోనా దెబ్బతో ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. సామాన్యులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.1.7 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అదే సమయంలో లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని మరో రూ.8 పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం లీటర్కు రూపాయి పెంచినా కేంద్రానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఉద్దీపన ప్యాకేజీ కోసం ఖర్చు చేసే రూ.1.7 లక్షల కోట్లను ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం రూపంలో రాబట్టుకోవచ్చునని భావిస్తున్నారు. కాబట్టి భారత్లో తగ్గింపు ఉండకపోవచ్చునని చెబుతున్నారు.