లక్ష మందికి 5 ఏటీఎంలేనట... నగదుకు ఎంత కష్టం
ఖాతాలోంచి డబ్బు తీసుకోవాలంటే బ్యాంక్ కు వెళ్లాలి లేదా ఏటీఎంకు వెళ్ళాలి. బ్యాంకు నుంచి తీసుకోవాలంటే నిర్దేశిత పని వేళల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ తర్వాత అవకాశం ఉండదు. సెలవు దినాల్లో డబ్బు అవసరం ఉంటే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అదుకునేవే ఏటీఎంలు. అయితే ఈ ఏటీఎం సంఖ్య వినియోగదారులకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండటంవల్ల బ్యాంకు కస్టమర్లు నానా కష్ఠాలు పడుతున్నారు. ఏటీఎంల సంఖ్య తక్కువగా ఉండటం ఒక సమస్య అయితే వాటిలో డబ్బులు సరిపోయేంతగా లేకపోవడం మరో సమస్యగా చెప్పవచ్చు. అసలు ఏటీఎంల సంఖ్య ఎందుకు తగ్గుతోంది, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల పరిస్థితి విధంగా ఉందొ చూద్దాం.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ...
* ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లోని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ప్రస్తుతం పట్టణాలు, చిన్న నగరాల్లో తమ ఏటీఎం లను ఏర్పాటు చేస్తున్నాయి.
* పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏటీఎం ల సంఖ్య చాలా తక్కువ స్థాయిలో ఉంటోంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ నగదు అవసరాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్కువ మంది బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాల్సి ఉంటోంది. ఇలా బ్యాంకులకు వెళ్లడం తమ సమయాన్ని, ప్రయాణం కోసం సొమ్మును వెచ్చించాల్సి వస్తోంది.
* భారత రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి వరకు దేశవ్యాప్తంగా 2, 21,703 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో కేవలం 19 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇలా చేస్తే మేలు
* గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎం లను ఏర్పాటు చేయడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. వీటి నిర్వహణ భారంగా ఉండటమే కారణమని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ ఖర్చులు, సెక్యూరిటీ తదితర నిర్వహణ ఖర్చులకు బ్యాంకులు వెనుకాడుతున్నాయి.
* అయితే ఇంటర్ ఛార్జ్ ఫీజుకు సంభందించిన ప్రోత్సాహకాలు ఇవ్వడం తో పాటు విద్యుత్ సబ్సిడీ , ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును కల్పించాలని ఏటీఎం ల పరిశ్రమ సమాఖ్య కోరుతోంది.
పెరుగుతున్న ఏటీఎంల అవసరం
* ప్రభుత్వం వివిధ రకాల లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.
* గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఎల్ పీజీ సబ్సిడీ, స్కాలర్ షిప్స్, ఫర్టిలైజర్ సబ్సిడీ, సామాజిక పెన్షన్లు , రైతులకు ఆర్థిక సహకారం వంటివి లబ్ది ఖాతాల్లోనే వేస్తున్నారు. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి లబ్ధిదారులు బ్యాంకులకు వెళుతున్నారు.
* అయితే బ్యాంకుల్లో కస్టమర్ల సంఖ్య పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎం ల అవసరం పెరుగుతోంది.
* 2018-19 సంవత్సరంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రూ. 65,561 కోట్ల నగదు లబ్ధిదారులకు అందింది.
* ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికి కేవలం ఐదు ఏటీఎంలు మాత్రమే ఉన్నాయని, మెట్రో నగరాల్లో లక్ష మందికి 50 ఏటీఎంలు ఉన్నాయని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య వర్గాలు చెబుతున్నాయి.