కార్డు లేకుండా నగదు ఉపసంహరణ: ఆర్బీఐ కీలక ఆదేశాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కార్డురహిత నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఏటీఎంలకు ఆదేశాలు జారీ చేసింది. తమ తమ బ్యాంకు ఖాతాదారులు కార్డు లేకుండానే ఏటీఎం నుండి నగదును తీసుకునే చర్యలు చేపట్టాలని సూచించింది. గురువారం బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆదేశాలను ఇచ్చింది.
ఇందుకు బ్యాంకులు, ఏటీఎం నెట్ వర్క్లతో కలిసి యూపీఐ ఇంటెగ్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ NPCIకి సూచించింది. కార్డ్ లెస్ క్యాష్ ఉపసంహరణ (ICCW) సమయంలో కస్టమర్ ఈ యూపీఐని వినియోగిస్తారు. ఆ తర్వాత నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్/ఏటీఎం నెట్ వర్క్స్ ద్వారా ట్రాన్సాక్షన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్బీఐ తెలిపింది.
కార్డ్లెస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన సూచించినవి కాకుండా ఏ ఛార్జీలు ఉండవని ఆర్బీఐ పేర్కొంది. అలాగే ICCW ట్రాన్సాక్షన్స్ కోసం ఉపసంహరణ పరిమితులు, సాధారణ ఏటీఎం ఉపసంహరణకు ఉన్నట్లుగానే ఉంటాయని తెలిపింది. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం హార్మనైజేషన్ ఆఫ్ టర్న్ అరౌంట్ టైమ్, కస్టమర్కు నష్టపరిహారానికి సంబంధించి ఇతర అన్ని సూచనలు ఎప్పటి వలె ఉంటాయని తెలిపింది.