RBI tokenisation: జూలై 1 నుండి కార్డు టోకెనైజేషన్
ఆన్లైన్ క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలను అరికట్టడానికి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కార్డు టోకెనైజేషన్ను జూలై 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకు వస్తోంది. అక్రమాలకు తావులేకుండా, సైబర్ మోసాలను నివారించేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ చెల్లింపులకు టోకెనైజేషన్ వ్యవస్థలను అమలులోకి తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు భద్రత పెరుగుతుంది. ఆర్బీఐ రూపొందించిన ఈ టోకెనైజేషన్ నిబంధనలు వచ్చే నెల నుండి అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో ఫోన్ పే, గూగుల్ పే, వంటి పేమెంట్ సర్వీస్ సైట్లలో కస్టమర్లు సేవ్ చేసుకున్న కార్డు వివరాలు డిలీట్ అవుతున్నాయి.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు చెందిన ముఖ్యమైన వివరాలకు బదులు టోకెన్ క్రియేట్ అవుతుంది. కస్టమర్లు తమ కార్డు వివరాలను మర్చంట్ సైట్లకు ఇవ్వకుండా పేమెంట్ చేసుకోవడానికి ఈ టోకెన్ వీలు కల్పిస్తుంది. కార్డు టోకెనైజేషన్ తప్పనిసరి కాదు. అయితే టోకెనైజేషన్ చేసుకోకుంటే పేమెంట్ చేసే ప్రతీసారి కార్డు వివరాలను, సీవీవీని ఎంటర్ చేయాలి.
పేమెంట్ సిస్టంలో సెక్యూరిటీ మెరుగుదల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ను తీసుకు వస్తోంది. ఈ సిస్టంలో కార్డు వివరాలకు బదులు ఒక కోడ్ను ఇస్తారు. దీనిని టోకెన్ అంటారు. ఇందులో ఎలాంటి సీక్రెట్ డేటా ఉండదు. టోకెన్ కేవలం సంబంధిత డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలకు రిఫరెన్స్గా ఉంటుంది. టోకెన్ వివరాలు బయటకు తెలిసినా సమస్య లేదు. ఆన్ లైన్ చెల్లింపులు జరిపే సమయంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు బదులు టోకెన్ వివరాలు ఇవ్వాలి. అప్పుడు కార్డు వివరాలు సేవ్ కావు. సెక్యూరిటీ ఉంటుంది. అయితే టోకెనైజేషన్ అవసరం లేదని భావిస్తే పేమెంట్ టైంలో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి.