వాట్సాప్ కి తోడుగా ఇక నుంచి జియో ఉంటుంది.
ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారంపై అవగాహన కల్పించేందుకు రిలయెన్స్ జియోతో వాట్సప్ చేతులు కలిపింది. ఇటీవలే జియో ఫోన్లల్లో వాట్సప్ సేవలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది జియో కస్టమర్లు ఇప్పుడు తమ ఫోన్లల్లో తొలిసారిగా వాట్సప్ ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సప్ ప్లాట్ఫామ్పై వైరల్ అవుతున్న తప్పుడు వీడియోలు, సమాచారాన్ని అడ్డుకునేందుకు జియో సహకారం తీసుకుంటోంది ఆ కంపెనీ.
జియోఫోన్లల్లో వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నవారందరికీ... ఫేక్న్యూస్పై అవగాహన కల్పించే సమాచారాన్ని షేర్ చేస్తోంది వాట్సప్. ఫార్వర్డెడ్ మెసేజెస్లో నిజానిజాలు ఎలా తెలుసుకోవాలి? షేర్ చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని సూచిస్తోంది. మూకదాడులు, మూకహత్యలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. దీనికంతటికీ కారణం ఫేక్న్యూస్, తప్పుడు సమాచారం విస్తృతంగా షేర్ అవుతుండటమే. అలాంటి ప్రాంతాల్లో జియో ఫోన్లు వాడేవారి సంఖ్య ఎక్కువ కాబట్టి జియో ద్వారా జనానికి అవగాహన కల్పిస్తోంది వాట్సప్.
ఇప్పటికే వాట్సప్ ప్రింట్, రేడియో ప్రచారాల ద్వారా జనాన్ని చైతన్య పరుస్తోంది. వాట్సప్లో ఎక్కువగా మెసేజెస్ ఫార్వర్డ్ చేయకుండా పరిమితి కూడా విధించింది. ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్తో చేతులు కలిపి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొత్త ఫీచర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి