UPI యూజర్లకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే ఆంక్షల మోత.. పూర్తి వివరాలు..
UPI News: ఒకపక్క దేశంలో డిజిటల్ చెల్లింపుల వేగం పుంజుకుంటోంది. మరో పక్క తీసుకుంటున్న చర్యలు మాత్రం దీనిని నెమ్మదింపచేసేవిగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిధానంగా ప్రజలు తిరిగి డబ్బును చెలామణీలోకి తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగే అవకాశం ఉందో, IANS నివేదిక ఏమంటుందో చూద్దాం.
పరిమితులు..
Google Pay, PhonePe, Paytmతో పాటు మరిన్ని ఇతర UPI యాప్లు త్వరలోనే వినియోదారుల లావాదేవీలపై పరిమితిని విధించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం HDFC రోజువారీ యూపీఐ లావాదేవీల పరిమితిని 10కి తగ్గించింది. యూపీఐ చెల్లింపుల మార్కెట్లో దాదాపు 95 శాతం వాటా కలిగి ఉన్న కంపెనీలు సైతం వాల్యూం క్యాప్ పాటించవచ్చని సమాచారం.
డిసెంబర్ 31 నాటికి..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఒక్కో డిజిటల్ చెల్లింపుల కంపెనీపై లావాదేవీల వాల్యూమ్ పరిమితిని డిసెంబర్ 31 నాటికి అమలు చేసేందుకు కృషి చేస్తోంది. ఇది అమలులోకి వస్తే సదరు కంపెనీ మార్కెట్లో వాల్యూమ్ 30 శాతానికి పరిమితం అవుతుంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్, NPCI పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఒక విధంగా పేటీఎం షేర్ల భారీ పతనానికి పరోక్షంగా ఇది కూడా కారణంగా నిలుస్తోంది.
నెలాఖరు నాటికి..
నవంబర్ 2022లో ఏకాగ్రత ప్రమాదాన్ని నివారించడానికి థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్ల కోసం NPCI 30 శాతం వాల్యూమ్ క్యాప్ను ప్రతిపాదించింది. ఇది ఇంకా అపరిష్కృతంగా ఉన్నప్పటికీ నెలాఖరులోగా దీనిపై పూర్తి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. మునుపటి మూడు నెలల్లో ప్రాసెస్ చేసిన ట్రాన్సాక్షన్ల మెుత్తం పరిమాణంలో 30 శాతాన్ని పరిమితిని లెక్కించటంలో వినియోగించనున్నట్లు సమాచారం.
మార్కెట్ లీడర్స్..
డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ప్రస్తుతం PhonePe, Google Pay, Paytm మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. ఇవి ఒకదానితో మరొకటి పోటీపడుతూ 94.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అక్టోబర్లో UPI లావాదేవీలు 7.7 శాతం పెరిగి 730 కోట్లకు చేరుకోగా వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.
అదరగొట్టిన YES బ్యాంక్..
పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను పరిశీలిస్తే అక్టోబర్లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 265.5 కోట్ల UPI లావాదేవీలను నమోదు చేసింది. యాక్సిస్ బ్యాంక్ 119.5 కోట్ల లావాదేవీలు, ICICI బ్యాంక్ 107.5 కోట్ల ట్రాన్సాక్షన్స్, Paytm పేమెంట్స్ బ్యాంక్ 101.9 కోట్ల లావాదేవీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 73.5 కోట్ల చెల్లింపులను పూర్తి చేశాయి.