భారత్ 'నెగిటివ్' నుండి 'స్థిరత్వం' దిశగా! రిస్క్ తగ్గింది కానీ...
భారత్ రేటింగ్ను అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నెగిటివ్ నుండి స్థిరత్వానికి మార్చింది. గతంలో కేటాయించిన బీఏఏ3 పరపతి రేటింగ్ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపిన మూడీస్, అవుట్లుక్ను మాత్రం అప్-గ్రేడ్ చేసినట్లు తెలిపింది. దేశీయ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థల్లో ప్రతికూలతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని, దీంతో వైఖరిని మార్చుకున్నట్లు తాజా నివేదికలో మూడీస్ తెలిపింది. పెట్టుబడులకు అనుకూలమైన రేటింగ్ల్లో బీఏఏ3 కనిష్ఠస్థాయి. ఇంతకన్నా తగ్గితే, రేటింగ్ జంక్ స్థాయికి పడిపోతుంది. గత ఏడాది మూడీస్ భారత పరపతి రేటింగ్ను బీఏఏ2 నుండి ప్రతికూల వైఖరితో కూడిన బీఏఏ3 స్థాయికి తగ్గించింది. బీఏఏ3 కనిష్ఠస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ను సూచిస్తుంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇండియా రేటింగ్ను బీఏఏ2 నుండి బీఏఏ3కు మూడీస్ డౌన్గ్రేడ్ చేసింది. అప్పుడు ఔట్లుక్ను సైతం నెగిటివ్గా పేర్కొంది. ఇప్పుడు ఈ ఔట్లుక్ను స్టేబుల్కు అప్గ్రేడ్ చేసింది. బీఏఏ రేటింగ్ దేశాల రుణ సగటు 48 దేశాల కంటే చాలా అధికమని చెబుతోంది.
వృద్ధి రేటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇండియా జీడీపీ వృద్ధి రేటు 9.3 శాతంగా ఉండవచ్చునని మూడీస్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధి రేటు 7.9 శాతం మేర ఉండవచ్చని పేర్కొంది. భారత జీడీపీ వృద్ధి రేటు కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 23.9 శాతానికి పడిపోయింది. క్రమంగా కోలుకున్నప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరానికి మైనస్ 7.3 శాతంగా నమోదయింది. ఈ ఆర్థిక సంవత్సరం 9.3 శాతానికి చేరుకోవచ్చునని, మధ్యకాలికంగా చూస్తే, వాస్తవిక జీడీపీ వృద్ధి సరాసరి 6 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది.
రిస్క్ తగ్గుదల
భారత వాస్తవ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య వ్యవస్థల రిస్క్ తగ్గుతోందని, ఈ వ్యవస్థలు మరింత క్షీణించబోవన్న అంచనాలు కనిపిస్తున్నాయని మూడీస్ పేర్కొంది. అధిక ద్రవ్యత, తగినంత మూలధనం ఉన్నందున బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ సంస్థల వల్ల ప్రభుత్వానికి రిస్క్ తగ్గిందని, అయితే అధిక రుణభారంతో కూడిన రిస్క్ మాత్రం కొనసాగుతోందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతున్న నేపథ్యంలో, కొద్ది సంవత్సరాల్లో ప్రభుత్వ ద్రవ్యలోటు తగ్గుతుందని, తద్వారా సార్వభౌమ పరపతి మరింత దిగజారదని మూడీస్ అంచనా వేసింది. 2019లో రుణభారం జీడీపీలో 7.4 శాతంగా ఉండగా, 2020లో 89 శాతానికి ఎగబాకిందని రిపోర్ట్ తెలిపింది. మున్ముందు రుణభారం జీడీపీలో 91 శాతానికి చేరుకోవచ్చునని అంచనా.
క్రెడిట్ రేటింగ్
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్ను కాస్త సానుకూలంగా సవరించినప్పటికీ క్రెడిట్ స్కోర్ను స్థిరంగా ఉంచింది. 1 జూన్ 2020న నెగిటివ్ ఔట్లుక్ను అలాగే ఉంచింది. 16 నవంబర్ 2017 ఔట్లుక్, స్టేబుల్గా ఉండగా, దానిని స్థిరంగా ఉంచింది. 9 ఏప్రిల్ 2015న ఔట్ లుక్ పాజిటివ్గా మార్చింది. 5 అక్టోబర్ 2021న ఔట్ లుక్ను స్థిరత్వానికి మార్చింది. కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది ఏప్రిల్ నుండి క్షీణించింది. కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఆ తర్వాత కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ దెబ్బతీసింది. అయితే ఫస్ట్ వేవ్ అంత ప్రభావం చూపలేదు. మరోవైపు వ్యాక్సినేషన్ రికవరీకి ఊతమిచ్చింది. గత కొద్ది నెలలుగా ఆర్థిక రికవరీ పుంజుకుంటోంది.