FY22లో భారత వృద్ధి రేటు 9.3 శాతం, వ్యాక్సినేషన్ పెరుగుతున్నా కొద్ది..
భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, దీంతో జీడీపీ వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9.3 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చునని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. 2022-23 సంవత్సరానికి వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదు కావొచ్చునని పేర్కొంది. కరోనా ఆంక్షలు సడలించడంతో వినియోగ డిమాండ్ పెరుగుతోందని, వ్యయం, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రికవరీ దిశగా కనిపిస్తున్నాయని తెలిపింది. అధిక కమోడిటీ ధరలతో వచ్చే పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో ప్రముఖ కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని మూడీస్ అనలిస్ట్ శ్వేత అన్నారు.
ఆర్థిక వ్యవస్థ సుస్థిర రికవరీతో భారత్ రుణ పరపతి మూలాలు దేశీయ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతున్నా కొద్దీ వినియోగ సెంటిమెంట్ స్థిరీకరణ సాధిస్తోందని పేర్కొంది. మూడీస్ ఇన్వెస్టర్స్ భారతీ ఎయిర్టెల్ రేటింగ్ను మరింత పాజిటివ్గా అంచనా వేస్తోంది. టారిఫ్ పెంచిన నేపథ్యంలో ఇటీవల ఎయిర్టెల్ స్టాక్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అమల్లో ఉన్న తక్కువ వడ్డీరేట్లతో నిధుల ఖర్చు తగ్గడంతో పాటు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కొత్త క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు మద్దతుగా నిలుస్తుందని మూడీస్ తెలిపింది. ప్రభుత్వ వ్యయంలో జాప్యం, ఇంధనకొరతతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలకు, తక్కువ కమొడిటీ ధరలతో కంపెనీల లాభాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.