భారత జీడీపీ వృద్ధి రేటును 0.4 శాతం తగ్గించిన మూడీస్
అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతం నుండి 9.1 శాతానికి సవరించింది. ఇంధన ధరల్లో భారీ వృద్థి, ఎరువుల దిగుమతి బిల్లులు పెరగడంతో ప్రభుత్వం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవాల్సి రావడం జీడీపీని ప్రభావితం చేస్తాయని తెలిపింది. భారత వృద్ధి రేటు తగ్గించడానికి వివిధ అంశాలు ప్రభావం చూపాయి.
గత కొద్దికాలంగా ఇంధన దిగుమతి బిల్లులు పెరిగాయి. ఎరువులదీ అదే పరిస్థితి. ఇది భారత వృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. అందుకే అధికంగా పెరిగిన క్రూడ్ ధరలు భారత వృద్ధిని తగ్గిస్తాయని, అయితే అంతర్జాతీయంగా నెలకొన్న అధిక ఆహార ఉత్పత్తుల ధరల ప్రభావం భారత్ పైన పడదని, మిగులు ఆహార ధాన్యాలు కలిగిన దేశం కావడం, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు ఇందుకు కారణమని మూడీస్ తెలిపింది.
ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 0.4 శాతం మేర తగ్గిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.4 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022 సంవత్సరం చివరి నాటికి ద్రవ్యోల్భణం 6.6 శాతంగా ఉంటుందని తెలిపింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందగా, 2020లో కరోనా సంక్షోభంతో జీడీపీ 6.7 శాతం క్షీణించింది.