ఇక నుంచి దేశమంతా ఒకే ఎస్బీఐ
ఇక నుంచి దేశమంతా ఒకే ఎస్బీఐ. స్టేట్ బ్యాంకు అనుబంధ బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. ఒకేచోట రెండు బ్యాంకుల శాఖలు ఉంటే ఒకే దాంట్లో విలీనం చేస్తారు. అసలు స్టేట్ బ్యాంకు శాఖలే లేని చోట కొత్త వాటిని ఏర
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఉన్న ఒకే ఒక ప్రభావితమైన బ్యాంకు ఎస్బీఐ. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పూర్తిచేయాలని భావిస్తున్న ఎస్బీఐ విలీనానికి వడివడిగా అడుగులు వేసింది. తద్వారా ప్రపంచ స్థాయి బ్యాంకును ఏర్పాటు చేసింది. అయితే ఎస్బీఐ దేశవ్యాప్త నెట్వర్క్ కలిగి ఉన్నప్పటికీ మూలధనం పరంగా అంతర్జాతీయ స్థాయి బ్యాంకులతో పోటీ పడేలా లేదు. దానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరం. ఈ విధంగా ఎస్బీఐ విలీనానికి ముందు, తర్వాతి పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్బీఐ:
భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఎస్బీఐనే అతిపెద్దది. బ్రాంచీల సంఖ్య, వ్యాపారం పరంగా ప్రపంచ స్థాయి బ్యాంకులతో ఎస్బీఐ పోటీ పడుతోంది. ఇటీవలి కాలంలో ఎస్బీఐ రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదిస్తూ,రెండోది కంప్యూటరీకరణ. ఈ క్రమంలో బ్యాంకు తక్కువ ఉద్యోగులతో ఎక్కువ సామర్థ్యాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తానికి 5 బ్యాంకులను ఎస్బీఐలో కలిపితే కొత్తగా ఏర్పడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తులు పోగుపడొచ్చని ఎస్బీఐ యాజమాన్యం లెక్కలు వేస్తోంది.
ఎస్బీహెచ్ ఇక ఎస్బీఐగా మారనుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తోపాటు జైపూర్- బికనీర్, పటియాలా, ట్రావెంకోర్, మైసూర్ తదితర ఐదు అనుబంధ స్టేట్ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు నష్టం ఉండదు
ఎస్బీఐ అనుబంధ ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా విలీన ప్రక్రియ కొనసాగుతుందని జైట్లీ హామీ ఇచ్చారు. ఐదు ప్రాంతీయ స్టేట్ బ్యాంకులను స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలనే ప్రతిపాదనను అన్ని బ్యాంకులకు పంపించి వారి ఆమోదం తీసుకున్న తరువాతే కేంద్ర మంత్రివర్గంలో ఈ ప్రతిపాదన ఆమోదించటం జరిగిందని వివరించారు. ప్రాంతీయ స్టేట్ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం వలన దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ ఏర్పడటంతోపాటు బ్యాంకు నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయని పేర్కొన్నారు.అంతే కాకుండా అంతర్జాతీయంగా భారత్ నుంచి పేరెన్నికగన్న ఒక బ్యాంకు ఏర్పాటుకు ఈ నిర్ణయం దారితీయగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్(ఎస్బీబీజే)
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్బీఎమ్)
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ)
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్(ఎస్బీటీ)
అనుబంధ బ్యాంకుల్లో ఎస్బీఐ వాటా 75 నుంచి 100 శాతం వరకూ ఉంది. మార్చి 2016 నాటికి ఎస్బీఐకి ఎస్బీఎమ్లో 90%, ఎస్బీటీలో 79.09%, స్టేట్ బ్యాంక్ ఆప్ బికనీర్ అండ్ జైపూర్లో 75.07%, ఎస్బీహచ్, ఎస్బీపీలలో 100 శాతం వాటా ఉంది.
విలీన ప్రయోజనాలు:
ప్రపంచంలో అతిపెద్ద 100 బ్యాంకుల్లో భారతదేశానికి సంబంధించిన బ్యాంకు ఒక్కటీ లేదు. జీడీపీ పరంగా ఏడో అతిపెద్ద దేశం, కొనుగోలు శక్తిపరంగా 3వ స్థానంలో ఉన్న దేశం ఈ విధంగా ఉండటం బాగోలేదని విధాన నిర్ణేతల వాదన. ఒకవేళ ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను కలిపితే ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటిగా కాగలదనే దీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. రూ. 37 లక్షల కోట్ల వ్యాపారంతో 22,500 శాఖలు, 58వేల ఏటీఎమ్లు(డిసెంబరు 2015 లెక్కలు) మొదలైన వాటితో విదేశీ బ్యాంకు శాఖల్లో తన ప్రాబల్యాన్ని ఎస్బీఐ చాటుకోగలనేది అనుకూలుర వాదన.
విలీనం వల్ల విపరిణామాలు:
అనుబంధ బ్యాంకులతో పోలిస్తే సాంకేతికంగా చాలా ముందంజలో ఉంది. అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు, వినియోగదారులు ఆ దిశగా అలవాటు పడేందుకు కొంచెం సమయం పడుతుంది.
అందుకే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపి ఒక బ్యాంకుగా ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ గురించి మాట్లాడుతూ మరోవైపు బ్యాంకులన్నింటినీ విలీనం చేస్తే ఇది ఎలా సాధ్యమవుతుందనేది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రశ్నగా ఉంది.
ఉద్యోగుల భవిష్యత్తు కెరీర్ ఎలా ఉంటుందనేది ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కావాలని వారు కోరుతున్నారు.
విలీనాల్లో తొలి అడుగులు
ఆగస్టు 13, 2008లో స్టేట్ బ్యాంక్ సౌరాష్ట్ర ఎస్బీఐలో కలిసిపోయింది. అప్పుడు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య ఆరుకు తగ్గింది. జూన్ 19,2009 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనానికి ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియ ఏప్రిల్, 2010 నాటికి పూర్తయింది. ఆ ఏడాది ఆగస్టు నెల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ బ్రాంచీలన్నీ ఎస్బీఐ శాఖల్లగానే పనిచేస్తున్నాయి.
ఎస్బీహెచ్ ఉద్యోగులకు వీఆర్ఎస్
ఒక పక్క సాంకేతికంగా అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతూ ఉంటే... మరో వైపు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో స్వచ్చంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో పాటు ఎస్బీఎం, ఎస్బీటీ, ఎస్బీపీ, ఎస్బీబీజే బ్యాంకుల్లో విలీనానికి సంబంధించి ఉద్యోగులకు సమాచారం అందింది. ఇప్పటికే ఆయా బ్యాంకుల బోర్డులు వీఆర్ఎస్ను అమలు చేసేందుకు ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
అనుబంధ బ్యాంకుల శాఖలను మూసేస్తారా?
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా తయారయ్యేందుకు ఎస్బీఐ విలీన ప్రక్రియ చేపట్టింది. త్వరలోనే విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనం తర్వాత అనుబంధ బ్యాంకుల శాఖల్లో చాలా వాటిని మూసివేయాలని ఎస్బీఐ నిర్ణయించినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. మూడు ప్రధాన కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు ఎస్బీఐ నుంచి వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచే ఈ ప్రక్రియ మొదలవనున్నట్లు తెలుస్తోంది.
గత నెలలోనే ఇప్పుడు అనుబంధ బ్యాంకుల్లో వీఆర్ఎస్ ప్రక్రియ నడుస్తోంది.
విలీనం తర్వాత జరిగేది ఇదే...
ఎస్బీఐలో ప్రాంతీయ స్టేట్ బ్యాంకులను విలీనం కారణంగా ఖర్చులు బాగా తగ్గి, పొదుపు పెరగనుందని అంచనా వేస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే రూ. 1000 కోట్ల వరకూ ఆదా అవుతుందని భావిస్తున్నారు. నిర్వహణ సామర్థ్యం గరిష్టంగా ఉపయోగించుకునేందుకు చేసే ప్రయత్నాలు, నిధుల కోసం చేసే ఖర్చుల ఆదా వంటి కారణాల రీత్యా కొత్తగా ఏర్పడనున్న ఎస్బీఐకి కలిసిరానుంది.