ముంబై, ఢిల్లీల కంటే హైదరాబాద్ అదుర్స్.. కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో టాప్
హైదరాబాద్లో రియాల్టీ రంగం క్రమంగా పుంజుకుంటోంది. మిగతా నగరాలతో పోలిస్తే భాగ్యనగరం వేగంగా కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. జేఎల్ఎల్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 7 ప్రధాననగరాలను పరిశీలిస్తే భాగ్యనగరంలో మూడో త్రైమాసికంలో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇందులో హైదరాబాద్ వాటానే 40 శాతంగా ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ఆరేడు నెలలుగా అన్ని రంగాలతో పాటు రియాల్టీ రంగం కూడా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.
ముంబైని మించి హైదరాబాద్లో డిమాండ్
రెసిడెన్షియల్ మార్కెట్లో నూతన ప్రారంభాలు, విక్రయాలు పుంజుకుంటున్నాయి. ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ సేల్స్పై జేఎల్ఎల్ రీసర్చ్ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన విక్రయాలతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 34 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం విక్రయాల్లో ఆర్థిక రాజధాని ముంబై వాటా 29 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్కు 22 శాతం ఉండగా భాగ్యనగరం వాటానే 40 శాతంగా నమోదయింది. 7 ప్రధాన నగరాలు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, కోల్కతాలలో కొత్త ప్రాజెక్టులు 4,59,378 యూనిట్ల నుండి 4,57,427 యూనిట్లకు క్షీణించాయి.
రూ.1 కోటి వరకు ప్రాజెక్టులు...
ఇక్కడి కొండాపూర్, హాఫీజ్పేట్, మణికొండ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముంబై, ఢిల్లీ కలిసి 50 శాతం వాటా కలిగి ఉంది. ఎల్బీ నగర్, కొంపల్లి ప్రాంతాల్లోను కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయి. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువగా 3BHK ఉన్నాయి. వీటి ధర రూ.75 లక్షల నుండి రూ.1 కోటి వరకు పలుకుతోంది. ఈ కొత్త ప్రాజెక్టులు 59 శాతంగా నమోదయ్యాయి. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం సేల్స్ 2,122 యూనిట్లుగా ఉన్నాయి.
రెడీ టూ హోమ్..
తక్కువ పెట్టుబడిస్థాయి, ముఖ్యంగా వెంటనే గృహ ప్రవేశాలకు వీలైన ప్రాజెక్టులపై డెవలపర్స్ దృష్టి సారించారని, మహమ్మారి పరిస్థితుల నుంచి సాధారణస్థితికి చేరుకున్నప్పుడు అమ్మకాలు మరింత పెరుగుతాయని, భాగ్యనగరంలోని అన్ని సబ్ మార్కెట్లలో రియల్ ఎస్టేట్ మూలధన విలువలు స్థిరంగా ఉన్నాయని జేఎల్ఎల్ ఇండియా, హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ తెలిపారు. వచ్చే రెండుమూడేళ్ల క్వార్టర్లలో పూర్తయ్యే ప్రాజెక్టులు, గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్ల అమ్మకాలు మరింతగా పెరగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.