eps పెన్షన్ స్కీం.. ఇది తెలుసుకోండి: పెన్షన్ పెరగాలంటే పీఎఫ్ తగ్గుతుంది
ప్రయివేటు రంగ ఉద్యోగులకు ఇటీవల సుప్రీం కోర్టు ఊరటనిచ్చే తీర్పును ఇచ్చింది. రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునే వెసులుబాటు కల్పించింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వారి ఆఖరి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు అంతకుముందు తీర్పు ఇచ్చింది. దీనిని ఈపీఎఫ్ఓ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, దీనిని ఇటీవల కొట్టివేసింది. ఇది ప్రయివేటు రంగ ఉద్యోగులకు పెన్షన్ విషయంలో ఊరట. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది.
పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు అవసరం?
ఈపీఎస్, ఈపీఎఫ్
కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ పథకంలో జమ చేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ అకౌంట్కు నెలకు గరిష్టంగా రూ.541 మాత్రమే జమవుతాయి.1996 మార్చిలో కేంద్రం మరిన్ని మార్పులు చేసింది. ఆ తర్వాత 2014లో ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నిబంధనలు సవరించింది. గరిష్టంగా రూ.15వేలు ప్రాతిపదికన రూ.1,250 ఈపీఎస్ ఖాతాకు జమ అవుతుంది. అయితే ఇక్కడ ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఓ మెలిక పెట్టింది. పూర్తి వేతనంపై ఆప్షన్ ఎంచుకుంటే గత అయిదేళ్ల సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. కానీ గత ఏడాది కాలపు వేతనం సగటును ప్రాతిపదికన తీసుకోబోమని తెలిపింది. దీంతో ఉద్యోగులు కేరళ కోర్టు మెట్లు ఎక్కగా, అది సుప్రీం కోర్టు దాకా వెళ్లింది.
ఈపీఎస్ పెరిగితే, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది
ప్రయివేటు రంగంలో అధిక వేతనాలు పొందుతూ రిటైరయ్యాక ఎక్కువ పెన్షన్ కావాలనుకునే వారికి ప్రతినెలా వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో జమ అయ్యే నగదు నిల్వలు మాత్రం తగ్గనున్నాయి. సంస్థ.. ఉద్యోగి శాలరీపై పన్నెండు శాతం ఈపీఎఫ్వోకు జమ చేయాల్సి ఉండగా ఇందులో 8.33 శాతం ఈపీఎస్కు(ఉద్యోగుల పెన్షన్ స్కీం), 3.67 శాతం ఉద్యోగి ఖాతాకు (ఈపీఎఫ్) వెళ్తుంది. ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం పెన్షన్కు నిర్దేశించిన గరిష్ఠ వేతనం రూ.15వేలుగా ఉన్నందున 8.33 శాతం లేదా రూ.1,250 మాత్రమే (ఏది ఎక్కువ అయితే అది) ఇప్పటిదాకా ఈపీఎస్కు జమ చేస్తున్నారు. మిగతా సొమ్ము ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇస్తే శాలరీపై 8.33 శాతం పూర్తిగా ఎంత అయితే అంత ఈపీఎస్కు వెళ్తుంది. అంటే వేతనంలో ఇదంతా ఈపీఎస్కే వెళ్తుంది. అంటే మీ ఈపీఎఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంటే, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గుతుంది.
ఉద్యోగుల పింఛన్ పెరుగుతుంది
ప్రతి సంవత్సరం పెరిగే వేతనం మేరకు ఈ మొత్తం పెరుగుతుంది. పదవీ విరమణ చేసిన వారికి లేదా సర్వీసులో కొనసాగుతున్న వారికైనా అధిక వేతనం ఉంటే అప్పటి నుంచి వడ్డీతో సహా ఈపీఎస్ బకాయిలు ఈపీఎఫ్ఓకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి అదనపు పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. వేతనం రూ.15వేలకు తక్కువగా ఉన్నప్పటికీ 2014 తర్వాత రిటైర్ అయిన వారికి దీంతో మేలు జరగనుంది. 2014 సెప్టెంబర్ తర్వాత పదవీ విరమణ చేసిన వారి పింఛన్ లెక్కించే సమయంలో ఐదేళ్ల సగటు వేతనం ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో చివరి ఏడాది వేతనం పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు ఉద్యోగుల పించన్ పెరుగుతుంది.
మీ పెన్షన్ ఇలా ఉంటుంది
10 ఏళ్ల సర్వీస్ ఉంటే సుప్రీం తీర్పుకు ముందు రూ.2,143, 15 ఏళ్లయితే రూ.3,214, 20 ఏళ్లయితే రూ.4,286, 25 ఏళ్లయితే రూ.5స357, 30 ఏళ్లయితే రూ.6,429, 35 ఏళ్లయితే రూ.7,500 పెన్షన్ ఉంటుంది.
తాజా తీర్పు ప్రకారం పెరిగిన వేతనం ఇలా ఉంటుంది.... రూ.30,000 వేతనంకు పదేళ్లకు రూ.4,286, 15 ఏళ్లకు రూ.6,429, 20 ఏళ్లకు రూ.8,571, 25 ఏళ్లకు రూ.10,714, 30 ఏళ్లకు రూ.12,857, 35 ఏళ్లకు రూ.15,000గా ఉంటుంది.
రూ.60,000 వేతనంకు పదేళ్లకు రూ.8,571, 15 ఏళ్లకు రూ.12,857, 20 ఏళ్లకు రూ.17,143, 25 ఏళ్లకు రూ.21,429, 30 ఏళ్లకు రూ.25,714, 35 ఏళ్లకు రూ.30,000గా ఉంటుంది.
రూ.90,000 వేతనంకు పదేళ్లకు రూ.12,857, 15 ఏళ్లకు రూ.19,286, 20 ఏళ్లకు రూ.25,714, 25 ఏళ్లకు రూ.32,143, 30 ఏళ్లకు రూ.38,571, 35 ఏళ్లకు రూ.45,000గా ఉంటుంది.