చైనాను దాటేసి.... భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
ఇటీవలి వరకు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా డ్రాగన్ దేశాన్ని అధిగమించింది. తద్వారా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న చైనాను అమెరికా అధిగమించింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య వ్యాల్యూ 119.42 బిలియన్ డాలర్లు కాగా, 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-21లో భారత్ నుండి అమెరికాకు ఎగుమతుల వ్యాల్యూ 76.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇది 51.62 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతుల వ్యాల్యూ 29 బిలియన్ డాలర్ల నుండి 43.31 బిలియన్ డాలర్లకు పెరిగింది. చైనాతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్య వ్యాల్యూ 115.42 బిలియన్ డాలర్లుగా నమోదయింది. చైనాకు ఎగుమతులు స్వల్పంగా పెరిగి 21.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతుల వ్యాల్యూ 94.16 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
రానున్న రోజుల్లో భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని, అంతర్జాతీయ కంపెనీలు కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని, చెబుతున్నారు. భారత్ వంటి దేశాలకు ఇతర దేశాల కంపెనీల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.2013-14 నుండి 2017-18 వరకు భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, అంతకుముందు యూఏఈ ఉంది. 2021-22లో యూఏఈ మూడో స్థానంలో ఉంది.