సంక్షోభంనుండి అమెరికా బయటపడుతుంది కానీ, తొలగించబడిన ఉద్యోగులకు గుడ్న్యూస్!!
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కానీ వచ్చే ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చునని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. కరోనా కారణంగా అగ్రరాజ్యంలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై.. మాంద్యంలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై ఫెడ్ రిజర్వ్ చైర్మన్ స్పందించారు.
పరిస్థితి దారుణం: అమెరికన్లు అప్పటి దాకా బయటకు రారు! 10 ఏళ్ల వరకు కోలుకోనంత నష్టం
అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
చైనా నుండి అమెరికాకు తమ ప్రొడక్షన్ యూనిట్లను బదలీ చేసే అమెరికా కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమని ఇటీవల అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఇప్పుడు జెరామ్ పావెల్ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై స్పందించారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ప్రజలు తిరిగి ఎవరి పనులు వారు చేసుకుంటారన్నారు. అలాగే నిరుద్యోగం కూడా తగ్గుతుందన్నారు.
సంక్షోభం నుండి బయటపడతాం
అమెరికా వృద్ధి పట్టాలు ఎక్కేందుకు కాస్త సమయం పట్టవచ్చునని జెరోమ్ పావెల్ చెప్పారు. వచ్చే ఏడాది చివరి వరకు పట్టవచ్చునన్నారు. అయితే ఎప్పటికి అనేది అంత కచ్చితంగా చెప్పలేమన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడం మన చేతుల్లోనే ఉందన్నారు. దీర్ఘకాలంలో లేదా మీడియం కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఎవరూ భావించరన్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని చెప్పారు. నిరుద్యోగం తగ్గుతుందని, ఈ సంక్షోభం నుండి బయటపడతామన్నారు.
అది ఇబ్బందికర పరిణామం
ప్రజలు ఎక్కువ కాలం వర్క్కు అనుసంధానం కాకుంటే ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయని, నైపుణ్యాల క్షీణత, శ్రామిక శక్తితో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని పావెల్ అన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు దెబ్బతింటే చాలా ప్రమాదమని, అది ఉద్యోగ కల్పన యంత్రం అన్నారు. ఇవి దెబ్బతింటే మాత్రం కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. దేశం ఎదుర్కోబోయే నిరుద్యోగం గురించి ఎవరూ ఊహించలేరన్నారు. ఈ నెలలో, వచ్చే నెలలో ఎక్కువగా తొలగింపులు ఉండవచ్చునని, గత రెండు నెలల్లో మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు.
తొలగించబడిన ఉద్యోగులకు శుభవార్త!
రెండు మూడు నెలల క్రితం చూస్తే అమెరికాలో 50 దశాబ్దాల్లోనే అతి తక్కువ నిరుద్యోగం నమోదయిందని కానీ ఇప్పుడు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పావెల్ ఓ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా 20 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, కానీ వారు తాత్కాలికంగానే తొలగించబడ్డారని చెప్పారు. వారు ఇప్పుడే నిరుద్యోగులని, కానీ కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్తారని ఆశించారు.
రానున్న రెండు నెలల్లో నిరుద్యోగం పెరగవచ్చు.. కానీ
కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు తగ్గితే, వ్యాపారాలు, కంపెనీలు తెరుచుకుంటే ప్రజలు తిరిగి వర్క్కు వెళ్తారని చెప్పారు. క్రమంగా డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న రెండు నెలల్లో నిరుద్యోగం మరింతగా పెరగవచ్చునని ఆ తర్వాత నుండి తగ్గుముఖం పడుతుందని చెప్పారు.