SBI Report: ఇతర దేశాల కంటే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.. ఎస్బీఐ నివేదిక వెల్లడి..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు అనే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాయి. అయితే భారత్ లో వాతావారణం కాస్త భిన్నంగా ఉన్నట్లు ఎస్బీఐ ఎకోవ్రాస్ నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని పేర్కొంది. ఈ నివేదికను రూపొందించిన ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ రూపొందించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి మంచి పదం తాత్కాలికంగా కనుమరుగైనట్లేనని అన్నారు. ప్రస్తుత అనిశ్చితి దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశం ఆహ్లాదకరమైన స్థితిలో ఉందని పేర్కొన్నారు.
SBI పరిశోధన నివేదికలో, రూపాయిని ప్రతిపాదికన పరిగణించి, భారతదేశం, అమెరికా, UK జర్మనీల జీవన వ్యయాన్ని పోల్చారు. సెప్టెంబర్ 2021లో, అన్ని దేశాల ఇళ్ల బడ్జెట్ లేదా జీవన వ్యయం రూ. 100 ఉంటే, భారత్, అమెరికాలో రూ.12 పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కానీ జర్మనీలో రూ.20, యూకేలో రూ.23 పెరిగిందని వివరించారు.
ఆహార పదార్థాల ధరల పరంగా, సెప్టెంబర్ 2021లో, ఈ నాలుగు దేశాల్లో రూ. 100కి లభించే వస్తువులు ఇప్పుడు అమెరికాలో రూ. 28, UKలో రూ. 18, జర్మనీలో రూ. 33 చొప్పున పెరిగాయి. అయితే భారతదేశంలో కేవలం రూ.15 మాత్రమే పెరిగాయి. ఈ కాలంలో, జీవన వ్యయం USలో రూ. 21, UKలో రూ. 30, జర్మనీలో రూ. 21 మరియు భారతదేశంలో రూ. 6 మాత్రమే పెరిగింది.
ఈ కాలంలో ఇంధన ధరలు భారతదేశంలో రూ. 16, అమెరికాలో రూ. 12 పెరిగాయి. యూకేలో రూ.93, జర్మనీలో రూ.62 ధర పెరిగింది. ప్రపంచ సంక్షోభం తర్వాత జీవన వ్యయం స్థాయి తగ్గింది, అయితే భారతదేశం ఇతర దేశాల కంటే మెరుగైన పనితీరును కనబరుస్తోందని నివేదిక స్పష్టం చేసింది.