ట్రంప్కు హామీపై మోడీ వెనుకడుగు! భారీ ఒప్పందాలకు ఇండియా నో?
కుటుంబంతో సహా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాలపై ఆసక్తి నెలకొంది. హెచ్1బీ వీసా నిబంధనల సడలింపు, ఇమ్మిగ్రేషన్ ఫ్యామిలీ, స్టూడెంట్ వీసా, పౌర అణు సాంకేతిక పరిజ్ఞానం, భార్య లేదా భర్తకు హెచ్1బీ వర్కింగ్ వీసా, వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండటం, వాణిజ్య హోదా పునరుద్దరణ, స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ తగ్గింపును భారత్ కోరుకుంటోంది. అమెరికన్ చికెన్ లెగ్స్, టర్కీ కోళ్లు, బ్లూ బెర్రీస్, చెర్రీస్ను మార్కెట్లుకో అనుమతించడం, పాల ఉత్పత్తులపై సుంకం తగ్గింపు, ఔషధాలపై తప్పనిసరి లైసెన్స్, ధరల నియంత్రణ ఎత్తివేత, బ్యాంకులు, బీమా, రిటైల్ వర్తకంలోకి FDI అనుమతి వంటి వాటిని అమెరికా కోరుతోంది.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన, మరిన్ని కథనాలు
అద్భుత వాణిజ్య ఒప్పందం
సోమవారం భారత్లో అడుగు పెట్టిన ట్రంప్కు రెడ్ కార్పెట్ పరిచింది ఇండియా. అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో మాట్లాడిన ట్రంప్ అద్భుతమైన వాణిజ్య ఒప్పందం రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. బేరమాడటంలో మోడీ మంచి దిట్ట అన్నారు. పెట్టుబడులకు అడ్డంకులను తొలగించే దిశగా చర్చలు జరుగుతున్నాయన్నారు.
అతిపెద్ద వాణిజ్య ఒప్పందం
రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని విస్తరించుకునే అంశంపై ఈ పర్యటనలో మోడీతో కలిసి చర్చిస్తామని ట్రంప్ చెప్పారు. ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని, అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా అది నిలిచిపోతుందన్నారు. రెండు దేశాలకు అది ప్రయోజకరమే అన్నారు.
బంధాలు బలోపేతం చేసుకుంటాం
స్వేచ్ఛాయుత భారత్-పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికా కృషి చేస్తాయని ట్రంప్ చెప్పారు. భారత్, అమెరికా మధ్య సహజసిద్ధమైన దీర్ఘకాల మైత్రి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర కూటములతో మా బంధాలను బలోపేతం చేసుకుంటామన్నారు. మోడీ ఇండియాలో అనేక సంస్కరణలు తెచ్చారని, భారత వ్యాపార వాతావరణంలో మరింత వేగవంతమైన మెరుగుదల అవసరమని చెప్పారు. మోడీ నాయకత్వంలో రికార్డ్ స్థాయిలో మార్పులు వస్తున్నాయన్నారు.
అందుకే వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చు
చికెన్, చీజ్ తదితర వస్తువులను భారత్లోకి అనుమతించాలని అమెరికా కోరుతుండగా, ఇందుకు మన దేశం సిద్ధంగా లేదు. దీంతో వాణిజ్యలోటును తగ్గించవచ్చునని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు మన రైతు ఆధాయాలను దెబ్బతీస్తాయని మోడీ ప్రభుత్వం కలత చెందుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని, కుదిరినా అది ఇప్పుడు కాకపోవచ్చునని అంటున్నారు. అయితే విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రెండు దేశాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తాయి.
వీటిపైనే..
ట్రంప్తో పాటు భారత్ రావాల్సిన అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి కొద్ది రోజుల క్రితం తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రెండు దేశాల మధ్య పరిమిత ఒప్పందం కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్షణ విభాగానికి సంబంధించిన హెలికాప్టర్ల కొనుగోలుపై ట్రంప్-మోడీ సంతకాలు చేయనున్నారు. ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు 60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు సంతకాలు జరిగే అవకాశముంది.
అమెరికాకే పెద్దపీట వేస్తారు కానీ
ప్రస్తుతం ఏ ఒప్పందాలు లేకున్నప్పటికీ ముందు ముందు అమెరికాతో జరిగే ఒప్పందాల్లో ట్రంప్ వారి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే అవకాశాలు తక్కువే. రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒప్పందాల అంశం పక్కన పెడితే వ్యవసాయ ఉత్పత్తుల విషయం మన దేశంలోని ఎంతోమంది రైతులకు సంబంధించిన అంశం. కాబట్టి కేంద్రం దీనిపై ఆసక్తిగా లేదని అంటున్నారు.