ఆర్థిక వ్యవస్థ మరింత దారుణం: అమెరికా-చైనా ట్రేడ్ వార్తో కరోనా రికవరీపై దెబ్బ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు మరింతగా పడిపోతుందని, అదే సమయంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఈ వైరస్ రికవరీపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) హెచ్చరించింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా యూరోపియన్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్ లైన్ ఈవెంట్లో మాట్లాడారు. 2020లో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని, వృద్ధి రేటు 3 శాతం కంటే పడిపోతుందని అంచనాలు ఉన్నాయని, ఇప్పుడు మరింతగా దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అంబానీ జియోలో విస్టా పెట్టుబడి, ఈ అమెరికా కంపెనీ వ్యవస్థాపకుల్లో భారతీయుడు
కరోనా.. కొత్తగా ట్రేడ్ వార్ నష్టం
ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయని, అమెరికా-చైనా ట్రేడ్ వార్ వల్ల కరోనా రికవరీపై భారీ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. తక్షణ వైద్య పరిష్కారాలు లేనందువల్ల కొన్ని ఆర్థికవ్యవస్థలపై మరింత ప్రభావం ఉండవచ్చునని చెప్పారు. అంతర్జాతీయంగా ఎకానమీ 3 శాతానికి పడిపోతుందని ఏప్రిల్ నెలలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. 1930 మహా మందగమనం తర్వాత మళ్లీ ఇదే అంటున్నారు. 2021లో మాత్రం ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకుంటుందన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది
ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా ఎకానమీ కరోనా, షట్ డౌన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. గత నెలలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మే నెలలో ఇది 20 శాతానికి చేరుకోవచ్చునని చెబుతున్నారు. కరోనా తర్వాత అమెరికా - చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది.
పేద దేశాలకు ఇబ్బంది
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ప్రపంచ వాణిజ్యం కీలకమన్నారు. లేదంటే ఖర్చులు పెరుగుతాయని, ఆదాయాలు తగ్గుతాయని, అప్పుడు భద్రత తగ్గిన ప్రపంచంలో ఉండాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా 103 దేశాలు ఆర్థిక సాయం కోరాయని, వాటిలో 50 దేశాలకు ఇప్పటికే ఇచ్చినట్లు తెలిపారు. అమెరికా వంటి ధనిక దేశాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పేద దేశాల్లో మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాలకు ఆరోగ్యం, ఆర్థిక నిర్వహణకు 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరమనుతాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు.