సంపన్నులపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అధిక పన్ను!
అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో పాటు ద్రవ్యలోటును పరిమితం చేసుకోవాలనే బడ్జెట్ ప్రణాళికను విడుదల చేశారు. అమెరికాలోను సంపన్నులు, కార్పోరేషన్స్ పైన పన్నులు పెంచేందుకు సిద్ధమయ్యారు. భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇళ్లకు అధికంగా నిధులను కేటాయించాలని నిర్ణయించారు. అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 5.8 లక్షల కోట్ల డాలర్లను వెచ్చించాలని జోబిడెన్ ప్రతిపాదించారు.
ఈ నెలలో అనుబంధ వ్యయ బిల్లును చట్టంగా మార్చడానికి ముందు, ఈ ఏడాదికి అంచనా వేసిన దాని కంటే ఇది తక్కువ కావడం గమనించదగ్గ విషయం. ద్రవ్యలోటు 1.15 లక్షల కోట్ల డాలర్లుగా ఉటుంది. రక్షణకు 795 బిలియన్ డాలర్లు, ప్రభుత్వ కార్యకలాపాలకు 915 బిలియన్ డాలర్లు, మిగిలినది సామాజిక భద్రత, ఆరోగ్యం, వడ్డీల చెల్లింపుకు బడ్జెట్లో కేటాయించనున్నారు.
అధిక పన్నుల కారణంగా వచ్చే పదేళ్లలో ఆదాయం 361 బిలియన్ డాలర్ల మేర పెరగనుందని అంచనా. ఇతర పన్నుల రూపంలో మరో 1.4 లక్షల కోట్ల డాలర్ల మేర వచ్చే దశాబ్ద కాలంలో వస్తుందని అంచనా. దీని ప్రకారం 100 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉన్న అమెరికన్ హౌస్ హోల్డ్స్ తమ ఆదాయంలో కనీసం 20 శాతం చెల్లించాలి. స్టాక్స్ వంటి లిక్విడ్ అసెట్స్కు వర్తిస్తాయి.