ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు కొందరికి మాత్రమే!
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అదిరిపోయే న్యూస్ చెప్పారు. పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు. అంటే 75 ఏళ్లు పైబడిన వారు ఇక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరంలేదు! అయితే ఈ ప్రకటనతో 75 ఏళ్లు నిండిన వారందరికీ ఊరట లభిస్తుందని భావించవద్దు. దీనికి షరతులు ఉన్నాయి. ఈ ప్రయోజనం కల్పించేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. దీంతో కొంతమంది సీనియర్ సిటిజన్లకు దీంతో ప్రయోజనం చేకూరే అవకాశాలు తక్కువ.
రెండు ఖాతాలు ఒకే బ్యాంకులో
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన సందర్భంగా ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది. కేవలం ఐటీ రిటర్న్స్ దాఖలులో మినహాయింపు తప్ప పన్ను చెల్లింపులో కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వం పలు నిబంధనలు రూపొందించింది. కేవలం పెన్షన్, వడ్డీపై వచ్చే ఆదాయంతో జీవించే సీనియర్ సిటిజన్లు మాత్రమే ITR దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే, ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకుల నుండి పెన్షన్ను, వడ్డీ ఆదాయాన్ని పొందేవారే ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. ఈ రెండు ఖాతాలు ఒకే బ్యాంకులో ఉండాలి. మరిన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.
ఇది కాస్త కష్టమే..
సీనియర్ సిటిజన్లకు మినహాయింపు ఉద్దేశ్యం మంచిదేనని, అయితే నిబంధనలు కాస్త కష్టంగా ఉన్నాయని అంటున్నారు. అంటే చాలామంది సీనియర్ సిటిజన్లు ఈ ప్రయోజనాన్ని పొందే అవకాశాలు తక్కువ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పెన్షన్, వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకు నుండి పొందాలనే నిబంధన సాధ్యం కానిదని చెబుతున్నారు. అలాంటి వారు మినహాయింపు పొందలేరని అంటున్నారు.
డిక్లరేషన్ ఇవ్వాలి
ITR దాఖలు నుండి మినహాయింపు పొందే సీనియర్ సిటిజన్లు 75 ఏళ్లు లేదా నిండి ఉండాలి. భారత్లో నివసించే వారై ఉండాలి. కేవలం పెన్షన్, వడ్డీపై వచ్చే ఆదాయంపై జీవించాలి. పెన్షన్, వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకులో ఉండాలి. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకులో ఉండాలి. ఏ బ్యాంకులు అనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ బ్యాంకుల నుంచి పెన్షన్, వడ్డీ ఆదాయాన్ని పొందే సీనియర్ సిటిజన్లు మాత్రమే ఐటీఆర్ దాఖలు నుండి మినహాయింపు పొందే వీలుంది. మరో ఇతర ఆదాయాన్ని పొందటం లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్లో ఉండాలి. లేదంటే ఐటీఆర్ దాఖలులో మినహాయింపు ఉండదు.