ప్రధాని మోడీతో అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలు భేటీ, ఏం చెప్పారంటే
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈవోలు ఆయనను కలిశారు. క్వాల్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టియానో అమోన్, అడోమ్ సీఈవో శంతను తదితరులు మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ సోలార్ సీఈవో విడ్మార్ భేటీ అయ్యారు. మోడీతో భేటీ అయిన మూడో సీఈవో. జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు.
తొలుత సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానోతో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇప్పటికే క్వాల్కామ్ తమ సేవలను భారత్లో అందిస్తోందని ప్రధాని మోడీతో సమావేశం అనంతరం క్రిస్టియానో గుర్తు చేశారు. వైర్లెస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, ఐటీ సేవలపై ప్రధాన దృష్టి సారించిన ప్రధాని మోడీ, ఇదే అంశంపై క్వాల్కామ్ సీఈఓ చర్చించారు. భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. భారత్తో జతకట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రిస్టియానో. ప్రధాని మోడీతో 5జీ టెక్నాలజీ పై చర్చించామని, 5జీ సేవలను వేగవంతం చేయాలనే భావనతో మోడీ ఉన్నారన్నారు. భారత్లో పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ చొరవ చూపుతున్నారన్నారు.
ఆ తర్వాత అడోబ్ సీఈవో శంతను నారాయణ్ భేటీ అయ్యారు. భారత 75వ స్వాతంత్ర వేడుకల్లో సహకారం అందించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత్లో ప్రతి చిన్నారి దరికి వీడియో యానిమిషన్ తీసుకు రావాలని ఆకాంక్షించారు. ప్రతి బిడ్డకు స్మార్ట్ విద్యను అందించాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా శంతను నారాయణ్తో అన్నారు. కోవిడ్ యుగంలో డిజిటల్ విద్యకు మరింత పునాది పడిందని, ఇప్పుడు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో కొన్ని ఏఐ ఎక్సలెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసే అంశంపై ప్రధాని, సీఈవో దృష్టి పెట్టారు.