ఇక చైనాకు చెక్, భారత్ టాప్ వ్యాపార భాగస్వామిగా అమెరికా! అగ్రరాజ్యంతో మరింత దృఢంగా..
వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికాతోనే భారత్ ఎక్కువ వాణిజ్యం నిర్వహించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమెరికా-భారత్ మధ్య 8,875 కోట్ల డాలర్లు నమోదయింది. 2018-19లోను అగ్రరాజ్యంతోనే మన వాణిజ్యం అధికంగా ఉంది. ఆ ఏడాది 8,796 కోట్ల డాలర్లుగా నిలిచింది. గతంలో భారత అతిపెద్ద వ్యాపారభాగస్వామిగా చైనా ఉండేది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా అమెరికా నిలుస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోం: బెంగళూరులో టెక్కీలు ఖాళీ, వీటికి భలే డిమాండ్
చైనాను దాటి అమెరికా.. అమెరికాతో సర్ప్లస్
2018-19లో అమెరికా-భారత్ మధ్య 87.96 బిలియన్ డాలర్ల వ్యాపారం జరగగా,గత ఆర్థిక సంవత్సరం 88.75 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారతదేశానికి వాణిజ్య మిగులు ఉన్న అతికొద్ది దేశాల్లో అమెరికా ఒకటి. డేటా ప్రకారం ఇరుదేశాల మధ్య ట్రేడ్ గ్యాప్ 2018-19లో 16.86 బిలియన్ డాలర్లు కాగా, 2019-20లో 17.42 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018-19 ముందు వరకు చైనా ఉండగా, అమెరికాతో వాణిజ్యం డ్రాగన్ కంట్రీని దాటేసింది.
చైనాతో భారీ వాణిజ్య లోటు.. క్రమంగా తగ్గుదల
ఇండియా-చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 87.08 బిలియన్ డాలర్లు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 81.87 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు 2018-19లో 53.57 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 48.66 బిలియన్ డాలర్లకు తగ్గింది. అమెరికాతో మనం సర్ప్లస్లో ఉండగా, చైనాతో వాణిజ్య లోటులో ఉండటమే కాదు అది కూడా పెద్ద మొత్తంలో ఉంది.
క్రమంగా చైనాకు చెక్
2013-14 నుండి 2017-18 వరకు భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనా కంటే ముందు యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని సాధ్యమైనంత మేర తగ్గించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఎప్పటి నుండో అడుగులు వేస్తోంది. ఇటీవల మరింత వేగం పెంచింది. ఆటోమొబైల్ నుండి దాదాపు ప్రతి సాధ్యమైనంత వరకు చైనా నుండి దిగుమతులు తగ్గించే ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్కు పిలుపునిచ్చింది.
అమెరికాతో మరింతగా పెరగనున్న వాణిజ్యం
గత ఏడాదిన్నర కాలంగా భారత్-అమెరికా మధ్య టారిఫ్ విషయంలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇరుదేశాలు వాణిజ్యపరమైన అంశాలపై చర్చిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధం మరింత దృఢంగా మారుతుందని, వ్యాపార భాగస్వామ్యం కూడా పెరవగచ్చునని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రవాసుల్లో ఎక్కువమంది భారతీయులే. ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. వాణిజ్య విభేదాలు తొలగిపోవడానికి ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
చైనా వ్యతిరేకత.. అమెరికా-భారత్ వాణిజ్యం పెరుగుతుంది
అమెరికాతో వాణిజ్యం ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి అన్నారు. అయితే వ్యవసాయం, పాడి, వీటికి సంబంధించిన అంశాల్లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో భారత్ కాస్త అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అమెరికా, భారత్లో చైనా వ్యతిరేక భావన పెరుగుతోందని, అలాగే చైనీస్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని తద్వారా వాణిజ్యాన్ని తగ్గించాలని భావిస్తున్నాయని కాబట్టి ఇది అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం మరింతగా పెరగడానికి తోడ్పడుతుందంటున్నారు. మరోవైపు, భారత్ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు కూడా చైనా నుండి దిగుమతులు తగ్గడానికి కారణం కానుంది. ఈ పరిణామాలు ఇరుదేశాల్లో చైనా ఉత్పత్తులు మరింతగా తగ్గనున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి.
అలా అయితే అమెరికాకు ఎగుమతులు పెరుగుతాయి
ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుండి అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలు ఇండియా, వియత్నాం వంటి దేశాలకు మకాం మారుస్తున్నాయని, మన దేశానికి ఎక్కువ కంపెనీలు వస్తే, అమెరికాకు ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. వీసా పాలనా రిలాక్సేషన్, భారీగా పెంచిన టారిఫ్స్ తగ్గించాలని భారత్ కోరుతోంది. వ్యవసాయం, ఆటోమొబైల్స్, విడిభాగాలు, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోను మార్కెట్ విస్తరించాలనుకుంటోంది.
మరోవైపు, వ్యవసాయ, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తులు, పాలు, వైద్య పరికరాలు, డేటా స్థానికీకరణతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తులపో దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరుతోంది.