అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్కు ఎంత చెల్లించాలంటే
అమెరికాకు 29 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నట్లు ఆ దేశ చట్టసభ్యుడు వెల్లడించారు. ఇందులో భారత్కు రుణపడి ఉన్న మొత్తం 216 బిలియన్ డాలర్లుగా వెల్లడించారు. అమెరికా అప్పులు రోజురోజు పెరిగిపోతున్నాయని ఆ దేశ చట్టసభ సభ్యులు అలెక్స్ మూనీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇందులోను అధిక శాతం అప్పులు తమకు (అమెరికా) సవాల్గా మారిన చైనా నుండి ఎక్కువగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, అంటే దేశంలో ఒక్కొక్కరిపై 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు తెలిపారు.
LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...
స్నేహంగా లేని చైనా, జపాన్కు ఎక్కువ
అమెరికా అప్పులు ఎక్కువగా చైనా, ఆ తర్వాత జపాన్ నుండి ఉన్నట్లు మూనీ తెలిపారు. రుణాలు 29 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో అమెరికన్ సిటిజన్ పైన తలసరి భారం భారీగా ఉంటుందని తెలిపారు. మనకు స్నేహంగా మెలగని జపాన్, చైనా.. ఈ రెండు దేశాలకు ఎక్కువగా అప్పులు ఉన్నట్లు అలెక్స్ మూనీ తెలిపారు. అంతర్జాతీయంగా చైనా నుండి మనకు తీవ్రమైన పోటీ నెలకొందని, వారికి అధిక రుణాలు ఉన్నామన్నారు. అ దేశానికి ట్రిలియన్ డాలర్లు, అలాగే జపాన్కు మరో 1 ట్రిలియన్ డాలర్ల రుణాలు ఉన్నట్లు తెలిపారు.
భారత్కు భారీ రుణం
భారత్కు 21,600 కోట్ల డాలర్లు (రూ.15 లక్షల కోట్లకు పైగా) బాకీ పడ్డామని గుర్తు చేశారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికి పంచితే 10,000 డాలర్లు వస్తుందన్నారు. ఈ రుణాలు ఎక్కడికి వెళ్తున్నాయనే అంశానికి సంబంధించి తప్పుడు సమాచారం ఉందన్నారు. అమెరికా మిత్రదేశాలు కానీ చైనా, జపాన్కే ఎక్కువ రుణపడి ఉన్నట్లు తెలిపారు. ఈ రిపబ్లికన్ సెనేటర్ వెస్ట్ వర్జీనియా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా ఊరటగా జో బిడెన్ ప్రభుత్వం ప్రకటించిన 1.9 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒబామా హయాంలో రెండింతలు
2000లో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పు ఒబామా హయాంలో రెండింతలైంది. దీనిని నిత్యం పెంచుతూ పోతున్నామని, దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందన్నారు. ఇలాంటి సమయంలో కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ పథకంలో చాలా నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లవని అనుమానం వ్యక్తం చేశారు.