జూమ్ గుడ్న్యూస్, బెంగళూరులో కొత్త టెక్ సెంటర్, కొత్త ఉద్యోగాలు
బెంగళూరులో త్వరలో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నట్లు జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ఇంక్ మంగళవారం తెలిపింది. భారత్ దేశంలో జూమ్ విస్తరణలో భాగంగా కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని గుడ్ న్యూస్ తెలిపింది. రీసెర్చ్, డెవలప్మెంట్, ఐటీ, సెక్యూరిటీతో పాటు బిజినెస్ కార్యకలాపాలు వంటివి ఈ కొత్త టెక్నాలజీ సెంటర్ కేంద్రంగా ఉంటాయి. ఈ మేరకు జూమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఇంజినీరింగ్ శంకరలింగ్ ఈ రోజు తెలిపారు.
ఉద్యోగుల్ని తొలగిస్తున్నాం: ఇండిగో చరిత్రలో తొలిసారి.. బాధాకర, కఠిన నిర్ణయం తప్పలేదు
ఇప్పటికే డేటా సెంటర్లు.. కొత్త ఉద్యోగాలు
కాలిఫోర్నియాకు చెందిన జూమ్కు ఇప్పటికే ఇండియాలోని ముంబైలో డేటా సెంటర్ ఉంది. బెంగళూరులో సెకండ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. కంపెనీ వృద్ధిని అనుసరించి మరిన్ని నగరాల్లో లోకల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అయితే ఇండియాకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను వెల్లడించలేదు. అలాగే ఎంతమందిని హైర్ చేసుకుంటారో కూడా వెల్లడించలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సహా వివిధ రంగాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో జూమ్ కాన్ఫరెన్స్ సేవల వినియోగం పెరిగింది.
ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం
తమ ప్లాట్ఫాంను మరింత మెరుగుపరిచేందుకు ఇన్నోవేషన్ హబ్గా ఉంటుందని, రాబోయే కొన్నేళ్లలో ఇక్కడి ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నామని శంకరలింగ్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక పెట్టుబడులు తమ నిబద్దతకు నిదర్శనం అన్నారు. దేశంలో నిరంతర వృద్ధి, పెట్టుబడులపై ఆశావహంగా ఉన్నామని, కరోనా సమయంలో ఇండియాలో 2,300కు పైగా సంస్థలకు తమ సేవల్ని ఉచితంగా అందిస్తున్నామని జూమ్ సీఈవో ఎరిక్సన్ యువాన్ అన్నారు. భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు చూస్తున్నట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్సింగ్లకు డిమాండ్
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు, విద్యా సంస్థలు వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫాం జూమ్ను ఆశ్రయించాయి. 2020 జనవరి - ఏప్రిల్ మధ్య భారీ వృద్ధిని నమోదు చేసింది. సిస్కో సిస్టమ్స్, వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫాంలతో పోటీ పడుతోంది. ఇటీవల రిలయన్స్ జియో మీట్, అమెరికా టెలికం సర్వీసెస్ ప్రొవైడర్ వెరిజోన్తో కలిసి ఎయిర్టెల్ బ్లూజీన్స్ను కూడా తీసుకు వచ్చాయి.
కాగా, జూమ్ పైన ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్ గ్రేడ్స్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం జూమ్ సేఫ్ కాదని కూడా ఇండియా హెచ్చరించింది. పలు దేశాలు దీని భద్రతాపరమైన అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేశాయి.