చైనా నుండి ఆ దిగుమతులు ఆపితే మనకే నష్టం, ఎల్లకాలం అదీ మంచిదికాదు: ఆర్సీ భార్గవ
చైనా నుండి దిగుమతులు హఠాత్తుగా ఇప్పుడే ఆపివేయడం ఇప్పుడే కష్టమని, అంతకుముందు భారతీయ కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ను బలంగా తయారు చేయాలని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఆటో రంగాలు సహా వివిధ రంగాలు చైనా దిగుమతులపై ఆధారపడి ఉండటంతో ఇప్పుడే దిగుమతులు ఆపేయడం కష్టమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆటో రంగంలోను ఇబ్బందేనని, అలాగే అత్యవసరాల దిగుమతి ఆపితే కష్టమని భార్గవ అన్నారు.
చైనా సామాగ్రితో జాగ్రత్త, అదే జరిగితే ఊహించని ప్రమాదం!
అప్పుడు చైనా నుండి దిగుమతి ఆపవచ్చు
అయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లేదా ఆర్థిక్మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని ఇటీవల స్పష్టంగా చెప్పారు. అత్యవసర వస్తువులు దిగుమతి చేసుకుంటే పర్లేదని, కానీ వినాయకుడి విగ్రహాలు కూడా దిగుమతి చేసుకోవాలా అని ప్రశ్నించారు. ఆర్సీ భార్గవ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని ఉత్పత్తుల నాణ్యతకు తగినట్లు, ధరకు పోటీగా ఉండేలా దేశీయ తయారీని తీర్చిదిద్దాలని సూచించారు. అప్పుడే చైనా వంటి దేశాల నుండి దిగుమతులు ఆపితే ప్రయోజనం ఉంటుందన్నారు.
దిగుమతులు భారమవుతున్నాయి
దేశీయంగా తయారీ లేకున్నా ఉన్నా అధిక ధరలతో లభిస్తే ఆయా ఉత్పత్తులకు అధిక ధరలతో కొనడం ప్రజలకు భారమే అన్నారు. ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులను తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిందే అన్నారు. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలహీనపడుతోందని, దిగుమతుల భారం కూడా అంతకంతకు అధికం అవుతోందన్నారు. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఓ ఉత్పత్తి దిగుమతి 60 శాతం నుండి 70 శాతం వరకు పెరిగిందని చెప్పారు.
ధరలు పెరుగుతాయి
సరిహద్దు ఉద్రికతల నేపథ్యంలో చైనా దిగుమతులు బహిష్కరించాలని పిలుపు రావడం సహజ పరిణామమేనని, అయితే భారత తయారీ సంస్థలు పోటీ సామర్థ్యం గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. సెంటిమెంట్ ఆధారంగా విధాన నిర్ణయాలు ఉండవన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. అదే సమయంలో పొరుగు దేశం నుంచి ఉత్పత్తులు బహిష్కరించడమంటే కొనుగోలు చేసే వస్తువులకు అధిక ధరలు చెల్లించాల్సి ఉంటుందనే విషయం కూడా గమనించాలన్నారు.
దిగుమతులపై కూడా ఆధారపడటం మంచిది కాదు
సుదీర్ఘకాలం దిగుమతులపై ఆధారపడటం వాణిజ్య ప్రయోజనాల రీత్యా ఏ మాత్రం మంచిది కాదని కూడా చెప్పారు. దిగుమతులు పెరిగిన కొద్ది ధరలు కూడా పెరిగి రూపాయి బలహీనమవుతుందన్నారు. కాని భారత్లో వస్తువుల లభ్యత తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత తక్కువ, ధరలు అధికం కూడా దిగుమతులపై ఆధారపడడానికి కారణమన్నారు. మన దేశంలో కంపెనీలు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. అందుకే ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ సందేశం ఇచ్చారని గుర్తు చేశారు.
అలా చేస్తే మనకే నష్టం
అత్యవసరం కాని వాటి దిగుమతి ఆపివేయవచ్చునని ఆర్సీ భార్గవ చెప్పారు. అత్యవసరాల దిగుమతి ఆపితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ప్రత్యామ్నాయం చూసుకునే వరకు చైనా నుండి దిగుమతులు ఆపలేమన్నారు. దిగుమతులు బహిష్కరించడం లాభమా లేదా నష్టమా అనేది వస్తువును బట్టి ఉంటుందని చెప్పారు. కాబట్టి అత్యవసర వస్తువును ఆపితే చైనా కంటే మనకే నష్టం ఎక్కువ అన్నారు. ఓ కారులో రెండు శాతం చైనా విడిభాగాలు లేకుండా తయారు చేయలేమని, ఆ రెండు శాతం కోసం దిగుమతులు నిలిపివేస్తే ఉద్యోగాలు పోతాయని, పన్ను ఆదాయం తగ్గుతుందని, అప్పుడు మనకే నష్టమని అభిప్రాయపడ్డారు. అత్యవసరమైతే దిగుమతి చేసుకోవాలన్నారు.