అమెరికా కంటే ఇండియా లోనే ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ: అయినా ఈ కామర్స్ లో మనం వెనుకబాటే !
అగ్ర రాజ్యం అమెరికా ను ఏ విషయంలోనూ భారత్ అధిగమించలేదు కేవలం ఒక్క జనాభాలో తప్ప. ఎందుకంటే అది చాలా పవర్ ఫుల్ కంట్రీ. కొనుగోలు శక్తి చాలా చాలా ఎక్కువ. అయితే, మన దేశం ఐదారేళ్ళ క్రితమే ఇంటర్నెట్ వినియోగంలో అమెరికా ను అధిగమించింది. అది కూడా జనాభా అధికంగా ఉండటం వల్ల సాధ్యమైంది. మొత్తం అమెరికాలో సుమారు 30 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా... ఇండియా లో 60 కోట్లకు పైగా ఇంటర్నెట్ వాడుతున్నారు. అంటే దాదాపు రెట్టింపు.
మన దేశంలో అందుబాటు ధరల్లో టెలికాం సేవలు ఉండటం, మొబైల్ ఫోన్లు తక్కువ ధరకే లభించటం వాళ్ళ గత ఐదేళ్ళలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పల్లె, పట్నం అన్న తేడా తొలిగిపోయింది. స్మార్ట్ ఫోన్ల వాడకంతో ఇంటర్నెట్ వాడకమూ పెరిగింది. కానీ ఇండియా లో ఇంత మంది ఇంటర్నెట్ వాడుతున్నా... ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నవారు (ఈ- కామర్స్ షాపింగ్) మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ఎంత తక్కువంటే అమెరికా తో పోల్చితే కేవలం మూడోవంతు మాత్రమే మన వద్ద ఆన్లైన్ లో కొంటున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు ఎంతగా విస్తరించినా... ఇంకా ఈ మార్కెట్ చాలా వరకు ఖాళీగానే ఉందని ఈ గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దాని ఆధారంగా మీ కోసం కొన్ని విషయాలు.
ప్రైవేట్ ఈక్విటీ పరవళ్లు: ఏడాదిలో భారీ స్థాయిలో పెట్టుబడులు
2021 లో 83 కోట్లు...
అధికారిక గణాంకాల ప్రకారమే ఇండియా లో 2019 నాటికీ 665 మిలియన్ ఇంటర్నెట్ యూసర్లు ఉన్నారు. అంటే 66 కోట్ల 50 లక్షల మంది అన్న మాట. ఈ సంఖ్య 2021 నాటికి ఏకంగా 83 కోట్లకు పెరగబోతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో 83 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగించటం ఒక విధంగా పెద్ద రికార్డు. ఎందుకంటే... మనదేశంలో అక్షరాస్య రేటు ఇంకా 70% కూడా దాటలేదు. అది కూడా 10వ తరగతి వరకు చదువుకున్న వారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ 80 కోట్ల కు పైగా జనాలు ఇంటర్నెట్ వాడుతున్నారంటే ... మన దేశంలో ఆన్లైన్ వేదికగా ఎంత వ్యాపార అవకాశం ఉందొ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత డిజిటల్ ఇండియా అని ముందుకు సాగుతున్నా.. చేయాల్సింది చాలా ఉందని చెబుతున్నారు.
600 బిలియన్ డాలర్లు ...
ప్రపంచంలోనే ఇండియా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన దేశ రిటైల్ మార్కెట్ పరిమాణం ఏకంగా 600 బిలియన్ డాలర్లు (రూ 4,20,000 కోట్లు) గా ఉంది. ఇది మరో రెండు మూడేళ్ళలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,00,000 కోట్లు) స్థాయికి చేరుకోనుంది. అయితే, ఇందులో ఆన్లైన్ (ఈ కామర్స్ ) వ్యాపారం వాటా కేవలం 5% మాత్రమే ఉంది. ఇంకా 95% రిటైల్ వ్యాపారం ఆఫ్ - లైన్ లోనే జరుగుతోంది. ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్న వారంతా ఆన్లైన్ లో కొనుగోలు చేయటం మొదలు పెడితే మన దేశం లో ఈ కామర్స్ రంగంలో ఎంత అభివృద్ధి సాధ్యమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, దేశంలో ఇంకా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, రోడ్లు, రైల్వేస్, విమానయానం, పోర్టుల వద్ద సదుపాయాలు మెరుగుపడాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో నాణ్యమైన విద్యుత్, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలని పేర్కొంటున్నారు.
అక్కడ 15% శాతం...
అమెరికా లో 30 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగాగురులు ఉండగా... అందులో 15% మంది ఈ కామర్స్ షాపింగ్ చేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం 66 కోట్ల మంది లో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య కేవలం 5 కోట్లు మాత్రమే ఉంది. అందులో కూడా ఆక్టివ్ గా షాపింగ్ చేసే వారి సంఖ్య మరీ తక్కువగా 2 కోట్లు మాత్రమే ఉంది. వచ్చే రెండేళ్లలో 80 కోట్లు దాటనున్న దేశేయా ఇంటర్నెట్ వినియోగడూరుల్లో అయినా ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుందేమో చూడాలి. అదే సమయంలో ప్రస్తుతం దేశంలోని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల నుంచి అధిక యూజర్లు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. అది కొంత వరకు మనకు పాజిటివ్ సంకేతంగా పనికొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.