చైనా నుంచి దిగుమతులు తప్పు కాదు కానీ గణేష్ విగ్రహాలు కూడానా?: నిర్మలా సీతారామన్
చైనా నుండి దిగుమతులు చేసుకోవడంలో తప్పు లేదని, కానీ చివరకు మనం పూజించే వినాయకుడి విగ్రహాలు కూడా డ్రాగన్ దేశం నుండి రావడం ఏమిటని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. మన దేశంలో లేని ముడి సరుకులను వివిధ పరిశ్రమలు ఎక్కడి నుండి దిగుమతి చేసుకున్నా అదేం తప్పుకాదని చెప్పారు. ఈ మేరకు ఆమె ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ గురించి తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ మీటింగ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా దిగుమతులపై స్పందించారు.
చైనా బ్యాంకులకు నేను హామీ ఇవ్వలేదు: అనిల్ అంబానీ షాక్, రుణరహిత సంస్థగా అనిల్ సంస్థ!
దిగుమతులు సరే.. కానీ
ఈ సందర్భంగా నిర్మల కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వావలంబనకు దోహదపడే వస్తువులను, ముడి పదార్ధాలను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదన్నారు. కానీ గణేశుడి ప్రతిమలను కూడా చైనా నుంచే దిగుమతి చేసుకోవడం ఏమిటన్నారు. దేశంలో ఉత్పత్తి పెంపుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడే వస్తువులను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేశారు.
చైనా గణేషులు కొనే పరిస్థితి ఎందుకు
ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి పర్వదినంజరుపుకుంటామని నిర్మల గుర్తు చేశారు. ఈ సందర్భంగా మట్టితో తయారు చేసిన గణేషుడి ప్రతిమలను స్థానిక కుమ్మరులు, అమ్మకందారుల నుంచి కొనుగోలు చేసే ఆనవాయితీ ఎంతో కాలం నుంచి వస్తోందని, కానీ ఇప్పుడు వాటినీ చైనా నుంచే దిగుమతి చేసుకొంటున్నామాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. మట్టితో మనం వినాయకుడి ప్రతిమల్ని మనం తయారు చేసుకోలేమా అని ప్రశ్నించారు.
చివరకు సబ్బు పెట్టే, ప్లాస్టిక్ వస్తువులు కూడా
దేశంలో అందుబాటులో లేని, మన పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం తప్పు కాదన్నారు. స్వావలంబన భారతదేశం అంటే దిగుమతులు అస్సలు చేయకూడదని కాదని, పారిశ్రామిక వృద్ధికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన దిగుమతులు చేసుకోవచ్చునని చెప్పారు. చివరకు సబ్బు పెట్టె, ప్లాస్టిక్ వస్తువులు, పూజకు ఉపయోగించే అగరవత్తీ వంటి రోజువాటే గృహోపకరణాలను కూడా దిగుమతి చేసుకోవడం స్వావలంబనకు తోడ్పడుతుందా అని ప్రశ్నించారు.
మన సంస్థలే తయారు చేసినప్పుడే ఆత్మనిర్భర్
ప్రత్యేకంగా ఇలాంటి ఉత్పత్తులను భారతీయ సంస్థలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ స్థానికంగా తయారు చేసినప్పుడు మాత్రమే దేశ స్వావలంబన సాధ్యపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. దిగుమతులు తప్పు కాదని, కానీ అవి ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇస్తాయన్నారు. కానీ ఉపాధి అవకాశాలు, వృద్ధిలాంటి ప్రయోజనాలు తీసుకురాలేని దిగుమతులు ఆత్మనిర్భర్ భారత్కు, భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడవన్నారు. స్థానికంగా తయారయ్యే అందుబాటులో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి మారాలని సూచించారు. మనం తయారు చేయగలిగిన వస్తువులను మనమే చేసుకోవాలని సూచించారు.