2022లో భారత రియాల్టీ రికవరీలో హైదరాబాద్ సహా ఈ సిటీలు ముందు
కరోనా మహమ్మారి కారణంగా హోమ్ లోన్ వడ్డీ రుణాలు ఏడాదిన్నరగా భారీగా తగ్గాయి. గత పదిహేనేళ్లలోనే రికార్డ్ కనిష్టం వద్ద ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గి ధరలు తగ్గిన కారణంగా సరసమైన ఇళ్ల ధరల కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా నగరాల్లో రియాల్టీ బూమ్ పుంజుకుంది. ఇప్పటికే రియాల్టీ పుంజుకున్న నేపథ్యంలో 2022లో బెంగళూరు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పునరుద్ధరణకు నాయకత్వం వహించవచ్చునని ప్రముఖ హౌసింగ్ డాట్ కామ్ వెల్లడించింది.
ఈ మూడు నగరాల్లో రియల్ బూమ్
హైదరాబాద్, బెంగళూరుతో పాటు ముంబైలోను రియాల్టీ బూమ్ మరింత జోరు కనిపించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ మూడు నగరాల్లో ఇళ్ల కొనుగోలు కార్యకలాపాలు పెరిగాయి. సూరత్, జైపూర్, పాట్నా వంటి టైర్ 2 నగరాలు 2021లో ఆన్ లైన్ ప్రాపర్టీ సెర్చ్ వ్యాల్యూమ్లో అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. సూరత్, జైపూర్, పాట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి టైర్ 2 నగరాల్లోను పెరుగుతోంది.
హైదరాబాద్, బెంగళూరు రికవరీలో లీడ్
హౌసింగ్ డాట్ కామ్ ఐరిస్ ఇండెక్స్ హై-ఇంటెంట్ హోమ్ బయ్యర్స్ ఆన్ లైన్ ప్రాపర్టీ సెర్చ్ వ్యాల్యూమ్ను ట్రాక్ చేస్తుంది. భారత్లోని కీలక 42 నగరాల్లో నివాస డిమాండును సూచిస్తోంది. రెసిడెన్షియల్ రియాల్టీకి 2021 కచ్చితంగా సానుకూల సంవత్సరమని, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ముప్పును భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే 2022 క్యాలెండర్ ఏడాదిలో రెసిడెన్షియల్ మార్కెట్లలో బలమైన ఊపు కొనసాగుతుందని విశ్వసిస్తున్నామని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ అన్నారు.
ఈ ఇండెక్స్ ప్రకారం 2022లో ఎక్కువమంది పెద్ద ఇళ్లకు ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలిపింది. 2021లో 3ప్లస్ బీహెచ్కే కాన్ఫిగరేషన్ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగినట్లు తెలిపింది. మెట్రో నగరాల్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్లు డిమాండ్ రికవరీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. టైర్ 2 నగరాలు సూరత్, జైపూర్, పాట్నా, మొహాలి, లక్నో, కోయంబత్తూరులలో రిమోట్ వర్కింగ్ పాలసీ కొనసాగుతోందని, హోమ్ బయ్యర్స్ ఇక్కడ కూడా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.
ఖరీదైన ఇళ్ల కోసం
రూ.2 కోట్ల కంటే ఎక్కువ వ్యాల్యూ కలిగిన ప్రాపర్టీ శోధన పెరిగినట్లు తేలింది. అయితే ప్రాజెక్టు డిలే, డెవలపర్ ఇన్సాల్వెన్సీ కారణంగా ఎన్సీఆర్లో నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్ వచ్చే ఏడాది హోమ్ బయ్యర్స్ కొనుగోలుదారులకు మరింత ఆకర్షితంగా మారనుందని అంటున్నారు. 2022 నాటికి మెగా సిటీలు ముంబై, బెంగళూరు, ఢిల్లీలలో రియాల్టీ కరోనా ముందుస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటోంది. 2021లో ఈ మూడు నగరాల్లో ఆన్ లైన్ సెర్చ్ వ్యాల్యూమ్ పెరిగింది.