ఆటో ఇండస్ట్రీకి కంటైనర్ల షాక్.. కారణమిదే, మరికొద్ది నెలలు ఇంతే
గత ఏడాది (2019) మందగమనం, ప్రస్తుత 2020లో కరోనా కారణంగా దేశీయ ఆటో పరిశ్రమ దెబ్బతిన్నది. కరోనా, లాక్ డౌన్ వల్ల మార్చి చివరి వారం నుండి కొద్ది నెలల పాటు సేల్స్ జీరోస్థాయికి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్-లాక్ తర్వాత కాస్త తేరుకుంటున్నాయి. దసరా, దీపావళి పండుగ సీజన్కు తోడు కరోనాతో వ్యక్తిగత వాహనాలకు ఆసక్తి చూపించడంతో రెండు మూడు నెలలుగా సేల్స్ రికార్డ్ స్థాయిని తాకుతున్నాయి. అయితే వాహన పరిశ్రమలకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎగుమతులు, దిగుమతుల కోసం కంటైనర్ల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇది మరో మూడు నాలుగు నెలలు ఉండవచ్చు.
ఆ యాప్స్తో చాలా జాగ్రత్త, ఉచ్చులో పడొద్దు: RBI హెచ్చరిక, పలువురి అరెస్ట్
కంటైనర్ల కొరతపై ఆందోళన
షిప్పింగ్ కంటైనర్ల కొరత కారణంగా రానున్న మూడు నాలుగు నెలలు విడి భాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని భారత ఆటోమొబైల్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అప్పుడు ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) తెలిపింది. జూలై నుండి నౌకాయాన సంస్థలు రవాణా ఛార్జీలు పెంచాయని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఆటో ఇండస్ట్రీలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయని, కానీ కంటైనర్స్ కొరత ఇబ్బందికరమేనని చెబుతోంది.
ప్రధాన ఎగుమతిదారులు
కరోనా నుండి కార్యకలాపాలు వేగవంతమవుతుండగా, ఆటో పరిశ్రమ కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని, కానీ కంటైనర్లు సమస్యగా మారాయని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. భారత ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ, టాటా మోటార్స్తో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్ వోక్స్వ్యాగన్, ఏజీ, ఫోర్డ్ మోటార్ వంటి తయారీదారులకు సియాం ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ సంస్థలు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి.
కారణమిదే..
డెన్మార్క్కు చెందిన ఏపీ మొల్లర్ మెర్క్స్ ఈ అంశంపై స్పందిస్తూ భారత్లో ఎగుమతులు పూర్వస్థితికి బౌన్స్ బ్యాక్ అయ్యాయని, కానీ దిగుమతులు లేకపోవడంతో సమతుల్యత కొరవడిందని చెబుతోంది. కంటైనర్ల కొరతకు ఇదే కారణమన్నారు. గత కొన్ని వారాలుగా మధ్యప్రాచ్యం నుండి తీసుకు వస్తున్న ఖాళీ కంటైనర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని దక్షిణాసియా అధిపతి స్టీవ్ ఫెల్డర్ అన్నారు.