చైనాకు ఇండియా చెక్: 300 ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపు!
సరిహద్దుల్లో భారత్ ను కవ్విస్తున్న పొరుగు దేశం చైనాకు గట్టి గా బుద్ధి చెప్పేందుకు భారత్ సమాయత్తమవుతోంది. అయితే ఈ సారి సైన్యంతో కాదు. చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే అనేక రకాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచటం ద్వారా డ్రాగన్ దేశానికి చెక్ పెట్టాలని ఇండియా వ్యూహం. ఇదే జరిగితే చైనాకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ దేశం నుంచి జరగాల్సిన ఎగుమతులు తగ్గిపోయి అక్కడి కంపెనీలకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి.
ప్రజల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఎంపిక చేసిన కొన్ని అతి ముఖ్యమైన ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు పెంచేయాలని, చైనా ఉత్పత్తులకు ఇచ్చే లైసెన్సులను మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంలా భారత్ కు మేలు జరగనుంది. ఒకటేమో, బోర్డర్లో చైనా దూకుడు తగ్గించేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు మన దేశంలోనే సంబంధిత ప్రోడక్టులు తయారు చేసే కంపెనీలకు మేలు జరుగుతుంది.
చైనా పెట్టుబడులు: మన స్టార్టప్స్కు దెబ్బ.. అలా చేస్తే ఇబ్బందికరమే!
10 బిలియన్ డాలర్ల ప్రభావం...
ప్రస్తుతం భారత్ అనుకుంటున్న విధంగా దిగుమతి సుంకాలను విధిస్తే... చైనా పై 8 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ 76,000 కోట్లు) ప్రభావం పడనుంది. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత వ్యూహంలో భాగంగా సుమారు 200 ప్రొడక్టులపై అధిక దిగుమతి సుంకాలు విధించటం, మరో 100 ప్రొడక్టులపై లైసెన్స్ విధానం కఠినతరం చేయటం, నాణ్యత ప్రమాణాల స్థాయి పెంచటం చేస్తారు. ఇదే జరిగితే ఇప్పుడు చైనా సరఫరా చేస్తున్న ధరలకు ఆయా ఉత్పత్తులు మార్కెట్లో లభించవు. వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. దీంతో, వాటి సంబంధిత ఇండియన్ ప్రొడక్టులకు గిరాకీ పెరుగుతుంది. చైనా కు ఈ విధంగా చెక్ పెట్టాలన్న ఆలోచన గత ఏప్రిల్ నుంచే ఉన్నప్పటికీ... ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో త్వరితగతిన దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
88 బిలియన్ డాలర్ల వాణిజ్యం...
ఇండియా - చైనా ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. రెండు దేశాలు కూడా జనాభాలోనూ, వ్యాపార భాగ్వమ్యంలోనూ ప్రపంచంలోనే అతిపెద్దవిగా ఉంటున్నాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా - చైనా ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 88 బిలియన్ డాలర్లు గా నమోదయింది. ఇది 2020 నాటికి మరింత పెరిగిందన్న అంచనాలున్నాయి. అయితే 88 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో చైనాకు అనుకూలంగా 53.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంటోంది. అంటే ఆ దేశం నుంచి మనం పెద్ద ఎత్తున వస్తువులను, ముడిసరుకులు దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట. అదే సమయంలో మన దేశం నుంచి మాత్రం తక్కువ మోతాదులోనే ఎగుమతులు చేస్తున్నాం అని స్పష్టమవుతోంది. ఈ రకంగా ఉన్న వాణిజ్య లోటును పూడ్చుకోవాలంటే కూడా అధిక టారిఫ్ లు విధించాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారత్ లో తయారీ కి ఊతం...
ఎప్పటి నుంచో భారత్ లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) కార్యక్రమాన్ని చేపడుతున్నా.... అనుకున్నంత పురోగతి లేదు. కానీ చైనాపై అధిక సుంకాల భారం మోపితే ఆ మేరకు భారత పరిశ్రమలకు మేలు జరుగుతుంది. కొత్త విభాగాల్లో కి విస్తరించి ఉత్పత్తి పెంచేందుకు వాటికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మనం ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైస్లు సహా అనేక రకాల కీలక ముడిపదార్ధాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వీటన్నిటిని మనం భారత్ లోనే తయారు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం చైనా సరఫరా చేసే ధరలకు ఇండియా లో వాటిని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. అదే చైనా ఉత్పత్తుల ధరలు పెరిగితే అప్పుడు మన దేశ ప్రొడక్టులకు గిరాకీ పెరుగుతుంది. అది మేక్ ఇన్ ఇండియా కు ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఏమైనా, చైనా కు మాత్రం సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిందేనని ప్రతి ఒక్క భారతీయుడూ కోరుకుంటున్న విషయం విదితమే.